
తొలగించమని చంద్రబాబుకు నేనే లేఖ రాశా: స్పీకర్ అయ్యన్న
నర్సీపట్నం: ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హులైన వికలాంగులకు పింఛన్ తొలగించమని సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు లక్ష వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకరే చెబుతున్నారు. రానున్న కాలంలో మరెన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు.
ఈ విషయమై రెండు నెలలు క్రితం తానే స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉందన్నారు. 40 శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 4,148 మంది వికలాంగుల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారన్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా.. 3,349 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు.