Brain-Dead Person Gives New Lease Of Life To Five Others In Visakhapatnam - Sakshi
Sakshi News home page

చనిపోయి.. ఐదుగురి జీవితాలకు ‘సంతోష’మిచ్చాడు!

Published Fri, Jun 23 2023 2:29 AM

Organ donation of a brain dead person - Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొండా వెంకట సంతోష్ కుమార్‌ (32) బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవయవాలను దానం చేయడానికి గాను సంతోష్‌ భౌతికకాయాన్ని విమ్స్‌కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శరీరంలో బాగా పనిచేస్తోన్న అవయవాలను తొలగించి జీవన్‌దాన్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఐదుగురికి కేటాయించారు.

విశాఖ సీపీ సహకారంతో ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. సంతోష్‌ భౌతికకాయానికి గురువారం విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్‌కు జరిగిన మాదిరిగా ఘన వీడ్కోలు పలికారు. సిబ్బంది రెండు వరసలుగా ఏర్పడి పూలుజల్లుతూ అమర్‌రహే సంతోష్‌ అంటూ నినాదాలు చేశారు. సంతోష్‌ తండ్రి శంకర్‌కు రాంబాబు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

విమ్స్‌ అంబులెన్స్‌లో ఆరిలోవలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించగా...కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సంతోష్‌ శరీరం నుంచి 2 కారి్నయాలు, కిడ్నీలు, లివర్‌ తీశామన్నారు. హెల్త్‌సిటీలో అపోలోకు ఓ కిడ్నీ, షీలానగర్‌లో కిమ్స్‌ ఆస్పత్రికి మరో కిడ్నీ, హెల్త్‌సిటీలో పినాకిల్‌ ఆస్పత్రికి లివర్, హనుమంతవాక వద్ద ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి కార్నియాలను జీవన్‌దాన్‌ ప్రొటోకాల్‌ ప్రకారం తరలించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement