
ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే విద్యుత్ ఛార్జీల అంచనా
ఇకపై 150 కిలోవాట్లు, అంతకుమించిన లోడ్కు ఫిక్స్డ్ ఛార్జీలు
వినియోగం లోడ్ 75 కిలోవాట్లకు మించితే 150 కిలోవాట్ల వరకు లోడ్ పెంచుకోవాలి.. డిస్కంల నెట్వర్క్ నుంచి సర్వీసున్న దూరం బట్టి నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాలి
కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ చట్టంలో మార్పులుచేస్తూ ఏపీఈఆర్సీ ముసాయిదా
ఈనెల 23లోగా అభ్యంతరాలు రాకుంటే అమల్లోకి కొత్త ఛార్జీలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ వినియోగదారులపై రూ.15,485 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఇప్పుడు దీనికి అదనగా కొత్త కనెక్షన్ల ఛార్జీలను పెంచుతూ మరో షాక్ ఇస్తోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే కొత్త ఛార్జీలు చెల్లించాలి్సందేనంటూ ప్రతిపాదన రూపొందించారు. వీటిని నిర్ణయించేందుకు, విద్యుత్ రెగ్యులేటరీ చట్టంలోని నిబంధనలకు నాలుగో సవరణను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఆ చట్టంలో మార్పులు చేస్తూ ముసాయిదాను రూపొందించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈనెల 23లోగా మండలికి ఈ–మెయిల్ ద్వారా పంపాలని కోరింది. అనంతరం.. ముసాయిదాను ప్రకటిస్తామని, ఇది ప్రకటించాక 21 రోజుల్లో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది.
ప్రస్తుత విధానం ఇదీ..
విద్యుత్ సర్వీసు అవసరమైనప్పుడు వినియోగదారులు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు దరఖాస్తు చేసుకుంటారు. డిస్కం నుంచి అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారు. అప్పటికే ఉన్న విద్యుత్ లైన్ల నుంచి కొత్త సర్వీసు ఇచ్చే ప్రాంతానికి ఎంతదూరం ఉంది?.. దానికెంత విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు అవసరమవుతాయని ఒక అంచనా రూపొందిస్తారు. దాని ప్రకారం ఆ ఖర్చులో కొంత మొత్తాన్ని లేదా పూర్తిగానూ చార్జీల రూపంలో చెల్లించాలంటూ వినియోగదారునికి నోటీసు జారీచేస్తారు. దాని ప్రకారం చెల్లించిన తరువాత సర్వీసును మంజూరుచేస్తారు. కానీ, ఇకపై అలా కుదరదు. దరఖాస్తు చేస్తున్నప్పుడే ముందే నిర్ణయించిన ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

కమిషన్కు ఛార్జీలు నిర్దేశించే అధికారం
విద్యుత్ లైన్ ఏర్పాటుకు అయిన ఖర్చుల రికవరీకి సంబంధించి 150 కిలోవాట్లు, అంతకుమించిన లోడ్కు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేయాల్సిన ఛార్జీలను నిర్దేశించే అధికారాన్ని కమిషన్కు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కట్టబెట్టింది. ఇందుకు అనుగుణంగా 150 కిలోవాట్ల వరకు కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేస్తున్న ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్గదర్శకాలను కమిషన్ ప్రతిపాదించింది. డిస్కంల నెట్వర్క్ నుంచి కిలోమీటర్ పరిధి.. 150 కిలోవాట్ల లోడ్ వరకు (కొత్త కనెక్షన్/ప్రస్తుతమున్న సర్వీస్కు అదనపు లోడ్ కింద) 2025–2026 ఆర్థిక ఏడాదిలో డెవలప్మెంట్ ఛార్జీలను కమిషన్ నిర్దేశించింది.
లోడు 75 కిలోవాట్లకు మించితే అంతే..
ఇక వినియోగదారుడు తన లోడ్ 75 కిలోవాట్లకు మించితే వారంతట వారే 150 కిలోవాట్ల వరకు ఎల్టీగానీ హెచ్టీగానీ ఎంచుకుని డెవలప్మెంట్ ఛార్జీలను చెల్లించాలి. ఈ ఛార్జీలతో పాటు అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ను రెగ్యులేటరీ నిబంధనల మేరకు చెల్లించాలి. 2026–2027 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త, అదనపు లోడ్కు సంబంధించిన సర్వీస్లైన్ ఛార్జీల షెడ్యూల్ను డిస్కంలు కమిషన్కు సమర్పించవచ్చు. డిస్కంల నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాకపోతే కొత్త ఛార్జీలను ఖరారు చేసేంత వరకూ 2025–2026 చార్జీలనే కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది.