రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
10 లీటర్ల సామర్థ్యమున్నవి 12,968 కాన్సన్ట్రేటర్లు
డి టైప్ సిలిండర్లు 27 వేలకు పైనే..
సాక్షి అమరావతి: థర్డ్ వేవ్ వచ్చినా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. పీహెచ్సీల స్థాయి నుంచే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు చేరుకున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల వాటి పనితీరును పర్యవేక్షించారు కూడా. వీటితో పాటు కీలక పాత్ర పోషించే డి టైప్ సిలిండర్లను కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 27,311 డి టైప్ సిలిండర్లు చేరుకున్నాయి.
మెడికల్ గ్యాస్ పైప్లైన్ల ఏర్పాట్లు సాగుతున్నాయి.146 ఆస్పత్రులకు 6,151 ఆక్సిజన్ బెడ్లకు అవసరమైన పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మూడు ఆస్పత్రులకు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్) కింద ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తుండగా, 143 ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. ఇవి కాకుండా ఆక్సిజన్ సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే భవిష్యత్తులో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లతో అవసరం ఉండదు.