ఎన్‌హెచ్‌ఏఐకు ప్రధాన రోడ్డు ప్రాజెక్టుల డీపీఆర్‌ బాధ్యత | Ministry of Road Transport and Roads will select the consultants | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఏఐకు ప్రధాన రోడ్డు ప్రాజెక్టుల డీపీఆర్‌ బాధ్యత

Jan 31 2021 5:37 AM | Updated on Jan 31 2021 5:37 AM

Ministry of Road Transport and Roads will select the consultants - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానంగా చేపట్టే రోడ్డు ప్రాజెక్టులకు సవివర నివేదికల (డీపీఆర్‌) తయారీ బాధ్యతను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించారు. కన్సల్టెన్సీల ఎంపిక మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ (మోర్త్‌ – రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ) నిర్వహించనుంది. సాధారణంగా రాష్ట్రంలో చేపట్టే రహదారి ప్రాజెక్టుకు డీపీఆర్, కన్సల్టెన్సీ బాధ్యతలు రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చూస్తుంది. రోడ్డులో వెళ్లే ట్రాఫిక్‌ వాహనాల సంఖ్య, ప్యాసింజర్‌ కార్‌ యూనిట్ల వివరాలపై నివేదిక రూపొందించి మోర్త్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. అయితే కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన బెంగుళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే, విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే రహదారుల ప్రాజెక్టులతో పాటు అనంతపురం–గుంటూరు రహదారి నిర్మాణానికి డీపీఆర్‌లను ఎన్‌హెచ్‌ఏఐ తయారు చేయనుంది. టెండర్ల ద్వారా కన్సల్టెన్సీలను ఎంపిక చేసి, రహదారుల ప్రాజెక్టులకయ్యే అంచనా వ్యయం, అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు.

► రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి శంకర్‌ నారాయణ ఇటీవల.. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పుడు బెంగుళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని విన్నవించారు.  
► కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదన సమర్పించింది. అయితే మైదుకూరు నుంచి విజయవాడకు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (అటవీ ప్రాంతం మీదుగా) నిర్మించాలని ప్రతిపాదించారు. 
► విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే రహదారి ప్రాజెక్టుకు ఏపీఐఐసీ రూ.1,500 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించింది. అయితే ఈ డీపీఆర్‌పై ఎన్‌హెచ్‌ఏఐ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్లు డీపీఆర్‌ తయారు చేయడంతో పాటు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. 
► అనంతపురం – గుంటూరు రహదారి నిర్మాణం కేంద్రమే చేపట్టనుంది. అనంతపురం, బుగ్గ, కొలిమిగుండ్ల, బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, గుంటూరు వరకు రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ను రూపొందించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement