
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డితో ఏపీ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఈ భేటీలో ప్రజల వద్దకు ఇంటింటకీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది మీరేనంటూ వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా ఆపరేటర్లు మొరపెట్టుకున్నారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్స్ కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
అనంతరం, ఎండీయూ ఆపరేటర్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లను నిలువునా ముంచింది.వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎండీయూ ఆపరేటర్లు ఉన్న సమయంలో రైస్ పక్కదోవ పట్టాయన్నారు కానీ ఈ నెలలో రేషన్ షాప్ ల ద్వారా రైస్ పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేక చోట్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మరి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు. మాకు వెహికిల్ లోన్స్ క్లియర్ చేస్తామని అది కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు. ప్రజాపంపిణీ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. ప్రజలు రేషన్ షాప్ల వద్ద క్యూలైన్స్లో నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్ళీ మళ్ళీ తిప్పించుకుంటున్నారు. మేం వైఎస్ జగన్ని కలిశాం. వారితో కలిసి మా సమస్యలు వివరించాం, తప్పకుండా మిమల్ని ఆదుకుంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు’ అని అన్నారు.