ఉపాధి కూలీల రూ. 1,027 కోట్ల వేతన బకాయిల కోసం పోరుబాట
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీసు ముందు కార్మీక సంఘాల ధర్నా
మే 1న పని ప్రదేశాల్లో నిరసన కార్యక్రమానికి నిర్ణయం
సాక్షి, అమరావతి: పుట్టిన రోజు వేడుక సంబరాల్లో మునిగితేలుతున్న సీఎం చంద్రబాబు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల అతీగతీ కూడా పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్ఘాటించింది. గత నాలుగున్నర నెలలుగా ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు రూ. 1,027 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు. మండుటెండలోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయం ప్రధాన గేటు ముందు ఆందోళన నిర్వహించారు.
పనిచేసిన 14 రోజులకు ఉపాధి వేతనాలు చెల్లింపులు పూర్తవ్వాలని చట్టం చెబుతున్నా, చేసిన పనికి నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా పేదలను వేధిస్తున్నారంటూ నిరసనలో పాల్గొన్న కార్మిక సంఘ నేతలు, కూలీలు దుయ్యబట్టారు. కూలీ కోసం, కూటి కోసం పేదలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాధినేతలు అసలు పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కుదించేందుకు చేసే కుట్రలను ఆపాలని స్పష్టం చేశారు.
ఫేస్యాప్ ద్వారా హాజరు పడితేనే వేతనం వస్తుందన్న షరతును ప్రస్తావిస్తూ, దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫేస్యాప్ సరిగా పనిచేయక కూలీలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఫేస్యాప్ను తొలగించి, మ్యాన్యువల్గానే కూలీల హాజరు మస్టరు వేయాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో మే 1న కార్మిక దినోత్సవాన రాష్ట్రమంతటా ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో పేదలు నిరసనలు తెలపనున్నట్టు వివరించారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు ఈమని అప్పారావు తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నేతలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉపాధి హామీ పథకం అమలు డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
నిరసన చేస్తున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కూలీలు


