కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్న హరిప్రసాద్ను డిస్మిస్ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐకి వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరిప్రసాద్ను విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హరిప్రసాద్ 2013లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించారు. పది రోజుల క్రితం నంద్యాల జిల్లా నుంచి కర్నూలు ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వచ్చారు. హరిప్రసాద్కు యువతితో వివాహేతర సంబంధం విషయంలో రెండు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపించి డిస్మిస్ చేశారు.
కాగా, హరిప్రసాద్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐగా పనిచేసే సమయంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా చాగలమర్రి టోల్ప్లాజా వద్ద పట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ హరిప్రసాద్ను వీఆర్కు పంపారు.


