సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.



