ఈ రాత్రికే నా భర్తను చంపేయండి.. 10 లక్షల సుఫారి!  | Kadapa Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

ఈ రాత్రికే నా భర్తను చంపేయండి.. 10 లక్షల సుఫారి! 

Apr 23 2026 7:58 AM | Updated on Apr 23 2026 8:25 AM

Kadapa Wife And Husband Incident

కిరాయి హంతకులతో రూ. 10 లక్షలకు సుఫారి కుదుర్చుకున్న భార్య  

భర్తను చంపేందుకు ప్రొద్దుటూరులో దిగిన హిందూపురం గ్యాంగ్‌  

కిరాయి గ్యాంగ్‌ కుట్రను భగ్నం చేసిన ప్రొద్దుటూరు పోలీసులు  

 

ప్రొద్దుటూరు క్రైం : తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేందుకు భార్య కిరాయిహంతకులకు సుఫారి ఇచ్చిన ఘటన ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ఈ రాత్రి గడిస్తే కిరాయి హంతకుల చేతిలో భర్త హతమయ్యేవాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి సుఫారి గ్యాంగ్‌ ఆట కట్టించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్య వైద్యం కోసం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో పని చేసే ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది.  

భర్తను చంపేందుకు సుఫారి.. 
తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని భార్య ప్రియుడితో కలిసి వ్యూహ రచన చేసింది. తనకు తెలిసిన వాళ్లు రౌడీలు ఉన్నారని, వాళ్లకు కొంత డబ్బు ఇస్తే పని ముగించేస్తారని ప్రియుడు చెప్పాడు. దీంతో మహిళ అతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కూడా ఇచ్చింది. దీంతో ప్రియుడు రాజుపాళెంలోని ఒక రౌడీషిటర్‌ను ఆశ్రయించాడు. లింగాపురం వ్యక్తిని హత్య చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ వ్యక్తిని చంపాలని చెప్పాడు. అతని వద్ద సు«ఫారి తీసుకున్న రౌడీషిటర్‌ ప్రొద్దుటూరులోనే పాత బస్టాండు సమీపంలో ఉన్న హిందూపురం వాళ్ల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వాళ్లకు రౌడీషిటర్‌ వివరించాడు. వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడంతో హిందూపురంలో ఉన్న ప్రధాన కిరాయి గ్యాంగ్‌ను ప్రొద్దుటూరుకు పిలిపించారు.  

ప్రొద్దుటూరులో దిగిన హిందూపురం గ్యాంగ్‌.. 
లింగాపురం వాసిని చంపేందుకు హిందూపురం నుంచి సుఫారి గ్యాంగ్‌ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో దిగారు. ఈ రాత్రికి లేదా గురువారం ఉదయం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం వన్‌టౌన్‌ పోలీసులకు తెలియడంతో అలర్ట్‌ అయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హిందూపురం గ్యాంగ్, రాజుపాళెం రౌడీషిటర్‌ను, లింగాపురం గ్రామంలోని భార్యభర్తలు, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.    

Advertisement
 
Advertisement
Advertisement