
సాక్షి, అమరావతి: అధికార పార్టీ తెలుగు దేశం మరింత దిగజారిపోయింది. అమరావతి మహిళలను టీవీ డిబేట్లో అగౌరవపరిచారంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతోంది. ఇప్పుడేమో సోషల్ మీడియా వేదికగానూ అసత్య ప్రచారాలతో ‘సాక్షి’పై విషం చిమ్ముతోంది.
తాజాగా.. ఏలూరు సాక్షి కార్యాలయానికి టీడీపీ నేతలు నిప్పు పెట్టి ఫర్నీచర్ను దహనం చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మూడు రోజులుగా ఆఫీస్ వద్ద నిరసలు చేస్తూ.. మంగళవారం సాయంత్రం రెచ్చిపోయారు. తొలుత దెందులూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. ఆపై కార్యాలయం కింద ఉన్న ఫ్లెక్సీతో పాటు ఫర్నీచర్ను తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది కూడా. అయితే..
టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఐ టీడీపీ, ఆ పార్టీ అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా సాక్షిపై తప్పుడు ప్రచారానికి దిగింది. సాక్షి కార్యాలయానికి తమ పార్టీ శ్రేణులు నిప్పు పెట్టలేదని, సంస్థ ఉద్యోగులే నిప్పు పెట్టి సీసీ ఫుటేజీ దొరక్కుండా మాయం చేశారంటూ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోంది. మరోవైపు.. పోలీసులేమో భిన్నమైన ప్రకటన ఒకటి చేయడం కొసమెరుపు.
కార్యాలయం వద్ద జరిగిన దాడికి, సాక్షికి అసలు సంబంధమే లేదంటూ కాలిన ఫర్నీచర్ యాజమానితో చెబుతున్నారు(పోలీసులే చెప్పించారు!). ఇలా.. పరస్పర విరుద్ధ ప్రచారాలతో టీడీపీ అడ్డంగా దొరికిపోయినట్లైంది. టీడీపీ శ్రేణుల తీరుతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే ఇలా కొత్త డ్రామాలకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది.