రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత
279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
కర్నూలు జిల్లా నగరడోనలో 45.4 డిగ్రీల నమోదు
అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఆస్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 279 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో 44.5, కాకినాడ జిల్లా కరపలో 44.4, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల వర్షం పడింది. రానున్న రెండు రోజులు కూడా తీవ్రమైన ఎండలు, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
నేడు తీవ్ర వడగాలులు వీచే మండలాలు ఇవే..
శ్రీకాకుళం జిల్లాలో బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


