ఖమ్మం తరలిస్తుండగా అంబులెన్స్లోనే మరణించిన బాలిక
గురుకుల యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థిని
తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన పోలవరం జిల్లా కూనవరం మండలంలో ఘటన
కూనవరం: పోలవరం జిల్లా కూనవరం మండలంలో గురుకుల విద్యార్థిని తెల్లం జాహ్నవి (12) సకాలంలో సరైన వైద్యం అందక మృతిచెందింది. దీనికి గురుకుల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పల్లూరుకు చెందిన జాహ్నవి కోతులగుట్ట ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి ఆమెకు వాంతులు కావడంతో గురుకుల సిబ్బంది స్థానిక సీహెచ్సీకి తరలించారు.
వైద్యుల చికిత్సతో తేరుకున్న ఆమెను తిరిగి హాస్టల్కి తీసుకొచ్చి సిక్రూమ్లో ఉంచారు. తెల్లవారుజాము నుంచి జాహ్నవికి మరింతగా వాంతులయ్యాయి. ఆదివారం ఉదయానికి ఆమె అపస్మారకస్థితికి చేరింది. ఉదయం 7 గంటలకు సీహెచ్సీకి తీసుకెళ్లగా భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లిన అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో ఖమ్మం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. మృతదేహాన్ని అదే అంబులెన్స్లో విద్యార్థిని స్వగ్రామం పల్లూరుకు తరలించారు.
ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్
జాహ్నవి మృతికి గురుకుల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు కుమారి, రమేష్, బంధువులు పల్లూరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శనివారం రాత్రి అనారోగ్యంగా ఉన్నప్పుడే తమకు సమాచారం ఇచ్చి ఉంటే తమ బిడ్డను బతికించుకునేవారిమని కన్నీరుమున్నీరుగా విలపించారు. జాహ్నవి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఎటపాక సీఐ కృష్ణ సర్దిచెప్పినా ఫలితం లేకపోవడంతో చింతూరు ఐటీడీఏ పీవో శుభంనొఖ్వాల్ పల్లూరు చేరుకొని బాధితులతో మాట్లాడారు.
ఈ ఘటనకు సంబంధించి మెడికల్, పోలీస్, రెవెన్యూ అధికారులతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద రూ.30 వేలు అందజేశారు. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్లో ఉద్యోగం కోసం తన వంతుగా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు. మూడువారాల కిందట వారింట్లో జరిగిన వేడుకలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన జాహ్నవి విగతజీవిగా మారటం చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.


