నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి | Full fee reimbursement on Jagananna arrival | Sakshi
Sakshi News home page

నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

Dec 21 2025 5:58 AM | Updated on Dec 21 2025 5:58 AM

Full fee reimbursement on Jagananna arrival

మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక. ఆ గ్రామంలో చౌక డిపో నడుపుకునే వాడిని. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మా చిన్నారి హనీకి మూడేళ్ల వయసులోనే గౌచర్‌ (గాకర్స్‌– శరీరంలో రక్తం సరఫరా లోపం (మెటబాలిక్‌ డిజార్డర్‌) అనే అరుదైన వ్యాధి వచ్చింది. దేశంలో ఇలాంటి వ్యాధిగ్రాస్తులు 14 మంది మాత్రమే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. నాకు, నా భార్యకు గుండె పగిలేంత దుఃఖం తన్నుకొచ్చింది. పాప వైద్యానికి రూ.లక్షలు ఖర్చవుతుందని తెలిసి ఏం చేయాలో పాలుపోలేదు. 

2020 సెపె్టంబర్‌ 26న సీఎం వైఎస్‌ జగన్‌.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం పర్యటనకు వచ్చారు. ఇది తెలిసి జగన్‌ వెళ్లే దారిలో మా పాపను నెత్తిన ఎక్కించుకుని ‘మా పాప ప్రాణాలు కాపాడండి’ అని ప్లకార్డు పట్టుకుని అర్థించాను. దానిని జగన్‌ చూస్తారని.. చూసి ఆగుతారని అస్సలు అనుకోలేదు. మా అదృష్టం కొద్దీ చూశారు. మా వద్దకు వచ్చి మాట్లాడారు. పాపకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని పక్కనే ఉన్న కలెక్టర్‌ హిమాంశు శుక్లాను ఆదేశించారు. 

హనీ వైద్యానికి రూ.కోటి మంజూరు చేశారు. మా చిన్నారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చే ఇంజక్షన్‌ ఖరీదు రూ.74 వేలు ఉంది. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హనీకి తొలి ఇంజెక్షన్‌ ఇచ్చారు. 2024 వరకు వైద్యం అందడంతో పాప త్వరగానే కోలుకుంది. ఉచిత విద్యకు భరోసాలో భాగంగా మండలం సమనసలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో హనీకి ఉచిత విద్య అందుతోంది. తను కూడా బాగా చదువుకుంటోంది. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.    – కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతులు, సాక్షి, అమలాపురం

జగనన్న వచ్చాకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌  
నా పేరు ఈడిగ శ్వేత. మాది నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామం.  తల్లిదండ్రులు మహాలక్షి్మ, తిరుపతయ్య గౌడ్‌. సామాన్య మధ్య తరగతి కుటుంబం మాది. నేను ఒక్కదాన్నే కుమార్తెను. నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. నేను 2017వ సంవత్సరంలో నంద్యాల శాంతిరాం కళాశాలలో బీటెక్‌(ఈసీఈ)లో చేరాను. అప్పట్లో ఏడాదికి ఫీజు 52వేలు కాగా, రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఇచ్చేవారు. 

మిగిలిన ఫీజు చెల్లించేందుకు మా తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవారు. వ్యవసాయానికి పెట్టుబడులు, కుటుంబ పోషణతోపాటు నాకు ఫీజులు కట్టడం మా నాన్నకు కష్టంగా ఉండేది. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొత్తం ఫీజు అప్పటి ప్రభుత్వమే చెల్లించింది. ఏడాదికి రూ. 52 వేలు చొప్పున రెండేళ్లపాటు ఫీజు రీయింబర్స్‌ చేశారు. నేను 2021వ సంవత్సరంలో బీ.టెక్‌ పూర్తి చేశాను. అదే ఏడాది చివరలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. 

నాలుగేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాలాంటి కుటుంబాలకు ఎంతో అండగా నిలిచి మా భవిష్యత్‌ను తీర్చిదిద్దారు. కానీ, నేడు విద్యార్థులకు ఆ భరోసా కరువైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మా ఒక్కరికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మేలు జరిగింది. థ్యాంక్స్‌ టూ జగనన్న. – కోవెలకుంట్ల  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement