వరమివ్వని ఉద్యానం | Farmers cultivating growth engine crops face huge losses this year | Sakshi
Sakshi News home page

వరమివ్వని ఉద్యానం

Apr 3 2025 6:03 AM | Updated on Apr 3 2025 6:03 AM

Farmers cultivating growth engine crops face huge losses this year

‘గ్రోత్‌ ఇంజిన్‌’ పంటల సాగు రైతులకు ఈ ఏడాది భారీ నష్టాలు

మిర్చి, టమాట పంటలకు గిట్టుబాటు ధరల్లేక కుదేలు 

అరటి ధరలు పడిపోయి ఆవేదన ∙చీనీ రైతులకూ చేదే 

మామిడి మీద ఆశలున్నా.. ముందు ముందు ఎలా ఉంటుందోనని భయం 

‘గ్రోత్‌ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అరటి, మిర్చి, టమాట రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్‌ నైన్‌ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది.   

మిరప, టమాట రైతుల కన్నీళ్లు 
మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్‌ మార్కెట్‌లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. 

చీనీ రైతులకూ చేదు గుళికలే.. 
రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో   ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా       అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన       సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి 
రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. సుమారు రూ. లక్ష పెట్టు బడి పెట్టా. «గిట్టుబాటు ధర లేకపోవటంతో పంటను తోటలోనే వదిలేశా. టమాట పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– బసవరాజు, దొడగట్ట, కళ్యాణదుర్గం

మార్కెటింగ్‌ సౌకర్యం లేదు
2 ఎకరాల్లో అరటి  సాగు చేశా. ఎకరాకు రూ. లక్ష చొప్పున రెండు లక్షల వరకూ  పెట్టుబడి పెట్టా. పంట ఉత్పత్తుల ఎగుమతు­లకు సరైన సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – నాగరాజు, పెద్దజలాలపురం గ్రామం,  శింగనమల, మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement