పక్కావ్యూహం ప్రకారమే..! | Fake liquor mafia gang exposed in the state | Sakshi
Sakshi News home page

పక్కావ్యూహం ప్రకారమే..!

Oct 11 2025 4:59 AM | Updated on Oct 11 2025 7:01 AM

Fake liquor mafia gang exposed in the state

2024లో చంద్రబాబు నుంచి తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా బి–ఫాం తీసుకుంటున్న జయచంద్రారెడ్డితో నిందితుడు జనార్దన్‌రావు

ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దందా ప్రణాళిక అమలు  

అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం

ఉండవల్లి నుంచే చక్రం తిప్పుతున్న మాస్టర్‌మైండ్‌ 

మద్యం విధానం వ్యవస్థీకృతం వెనుక ఆయనే 

2024 ఎన్నికలకు ముందే ‘‘ఆఫ్రికా మోడల్‌’’కు పన్నాగం 

అందుకే సీనియర్లను కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్‌ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దందా షురూ 

ఇందులోభాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాల తొలగింపు 

బెల్టుషాప్‌లు, పర్మిట్‌ రూమ్‌లతో వ్యవస్థపై పూర్తి నియంత్రణ 

నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి యథేచ్చగా అమ్మకాలు

టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లోకి మొత్తం మద్యం నెట్‌వర్క్‌ 

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రీతిలో రాష్ట్రమంతా నకిలీ యూనిట్లు 

ఎక్కడ మద్యం దొరికినా జయచంద్రారెడ్డి, జనార్దనరావుతో లింకులు

అత్యంత ప్రమాదకర ఆల్కహాల్‌ శాతంతో నకిలీ మద్యం తయారీ

ప్రాంతాలవారీగా చినబాబు గ్యాంగ్‌కు బాధ్యతలు అప్పగింత

మొత్తం మద్యం అమ్మకాల్లో మూడో వంతు నకిలీ సరుకే 

తొలి ఏడాదే రూ.5,280 కోట్లు కొల్లగొట్టిన పచ్చ ముఠా

నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్ల దోపిడీకి స్కెచ్‌ 

కరకట్ట బంగ్లా వాటా 30 శాతం.. దాదాపు రూ.15 వేల కోట్లు 

రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తున్న నకిలీ మద్యం  

అమాంతంగా పెరుగుతున్న అంతుచిక్కని మరణాలు 

దీంతో కంగారుపడి దాడులు చేసిన ఎక్సైజ్‌ అధికారులు 

అనుకోకుండా బయటపడ్డ నకిలీ మద్యం మాఫియా గుట్టు 

ప్రభుత్వ పెద్దలే మాఫియా రింగ్‌ మాస్టర్లుగా తేలడంతో గప్‌చుప్‌

రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్‌ రూమ్‌లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లు నెలకొల్పి షాప్‌లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.

నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం డీల్‌’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది.  

సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్‌ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్‌’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్‌ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్‌కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌లను సైతం పక్కనపెట్టారు. 

ఖర్చంతా తానే భరిస్తానని శంకర్‌యాదవ్‌ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్‌ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్‌ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. 

ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది.  

అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్‌..  
నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్‌ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్‌ రూమ్‌లకు అనుమతిచ్చారు. 

టీడీపీ సిండికేట్‌ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్‌ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్‌కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్‌ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 

20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్‌ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్‌వర్క్‌ అంతటినీ ముఖ్యనేత  టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు.  

పచ్చ సీసాలో నకిలీ మద్యం 
కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్‌వర్క్‌ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. 

రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్‌ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. 

కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్‌ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (వాడుక భాషలో స్పిరిట్‌ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. 

రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు 
కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్‌ అడ్మిరల్‌... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. 

అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్‌ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్‌ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. 

మోగుతున్న మరణమృదంగం...  
టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్‌ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్‌ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  

ఇటీవల ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్‌ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో   తనిఖీలు, దాడులు చేసింది. 

ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్‌ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్‌ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.     

తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ  
రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్‌ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. 

ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్‌ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్‌గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్‌ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  

అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది.  చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్‌ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్‌ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్ర­యిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్‌గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫి­యాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది.  

స్పిరిట్‌ .. మనుషులకు ప్రాణాంతకం!
వాస్తవానికి ఈ స్పిరిట్‌లో 100 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్‌ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్‌ను బాగా పలుచన (డైల్యూట్‌) చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గిస్తాయి. 

తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్‌ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్‌ను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం లేదు.  

స్పిరిట్‌లోని ప్రమాదకర కారమిల్‌ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు.  అంతేకాదు బ్రాండెడ్‌ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్‌ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్‌ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్‌ దుకాణాలు, 3,736 పర్మిట్‌ రూమ్‌లు, 75 వేల బెల్ట్‌ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement