లేని నీళ్లతో కనికట్టు | Expansion of old projects along with new projects in AP and Telangana | Sakshi
Sakshi News home page

లేని నీళ్లతో కనికట్టు

Apr 19 2026 5:49 AM | Updated on Apr 19 2026 5:50 AM

Expansion of old projects along with new projects in AP and Telangana

ఏపీ, తెలంగాణల్లో కొత్త ప్రాజెక్టులతోపాటు పాత ప్రాజెక్టుల విస్తరణ 

భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులకు అనుమతులు తిరస్కరణకు గురికావచ్చు 

సీడబ్ల్యూసీకి కృష్ణాబోర్డు లేఖ 

సాక్షి, అమరావతి: కృష్ణానదీ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేపట్టిన పలు ప్రాజెక్టులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తింది.  నికర జలాలతో పాటు మిగులు జలాల కేటాయింపుపై కృష్ణానదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌–2 (కేడబ్ల్యూడీటీ–2) విచారణ ఒకపక్క కొనసాగుతుంటే, మరోపక్క ‘ట్రిబ్యునల్‌ ఇంకా కేటాయించని జలాలను ఆధారంగా చేసుకుని’ రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను అడ్డగోలుగా నిర్మిస్తున్నాయని,  అలాగే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయని బోర్డ్‌ పేర్కొంది.  

ఇలాంటి ప్రాజెక్టులకు భవిష్యత్తులో అంతర్రాష్ట్ర అనుమతులు, పెట్టుబడి అనుమతులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటి లభ్యతతో పాటు అంతర్రాష్ట్ర పర్యవసానాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇలాంటి ప్రాజెక్టులకి అనుమతుల జారీ విషయాన్ని పరిశీలించడం సైతం భవిష్యత్తులో సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతుల జారీ విషయంలో మార్గనిర్దేశం చేయాలని కేంద్ర జలసంఘాని (సీడబ్ల్యూసీ)కి విజ్ఞప్తి చేసింది.  అలాగే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు  ఏ మేరకు విస్తరించాలో నిర్థారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 

ఇందుకు గాను ఆయా ప్రాజెక్టులకు గతంలో టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) అనుమతులను ఏ మేరకు జారీ చేశారన్న వివరాలను తమకు అందజేయాలని కోరింది.  ‘కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు జరిపే వరకు మిగులు జలాల నిర్థారణపై అనిశ్చితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరిపేవరకు  కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికల తయారీ, వాటికి అనుమతుల జారీ సరైంది కాదు’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మధింపు విభాగం చీఫ్‌ ఇంజినీర్‌కు లేఖ రాసింది.  

లేఖలో ప్రధానాంశాలు... 
»  ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 85(8)(డీ) ప్రకారం 2014, జూన్‌ 2కి ముందు నిర్మాణం పూర్తైన, నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టుల నీటి లభ్యతపై కొత్త ప్రాజెక్టు ఎలాంటి దుష్ప్రభావం చూపకూడదు.  

» కేంద్రం 2021 జూలై 15న జారీ చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌లోని పెరా 2(ఎఫ్‌), 2(జీ) ప్రకారం .. నిర్మాణంలోని అనుమతి లేని ప్రాజెక్టులతో పాటు విస్తరణకు లోనైన ప్రాజెక్టులకి నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో వాటి వినియోగాన్ని నిలుపుదల చేయాలి. 

» అయితే ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వేసిన కేసు న్యాయస్థానం పరిధిలో ఉండడంతో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో కృష్ణా బోర్డు లేదు.  

»  కచ్చితమైన నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులను నీటి వినియోగం కోసం ఏదైనా నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు.  

»  ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు విస్తరణకు లోనైనట్టు బోర్డు పరిశీలనకు వచ్చింది. ఆయా ప్రాజెక్టులకు గతంలో సీడబ్ల్యూసీలోని టీఏసీ జారీ చేసిన అనుమతులకు విరుద్ధంగా  వాటిపై అదనపు ఎత్తిపోతల పథకాలను నిరి్మంచడం, కాల్వల సామర్థ్యం పెంచడం, ఆయకట్టు సామర్థ్యం పెంచడం, ఒక పరీవాహక ప్రాంతం నుంచి మరో పరీవాహక ప్రాంతానికి నీళ్ల తరలించడం వంటి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టులకు మళ్లీఅనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.  

»   కొత్త ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు టీఏసీ అనుమతులకు విరుద్ధంగా ఇలా విస్తరణకు గురైన ప్రాజెక్టులను సైతం అనుమతులు లేని ప్రాజెక్టులుగా పరిగణించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement