ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి  | Election rules must be followed | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి 

Mar 8 2024 4:05 AM | Updated on Mar 8 2024 3:00 PM

Election rules must be followed - Sakshi

రాజకీయపార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ 

షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచే ప్రవర్తన నియమావళి అమలు 

అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండకూడదు 

రూ.10 వేలకు మించి విలువైన వస్తువుల రవాణా నిషిద్ధం 

స్టార్‌ క్యాంపెయినర్ల దగ్గర రూ. లక్షకు మించి ఉండకూడదు 

లోక్‌సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.95 లక్షలు 

శాసన సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.40 లక్షలు 

ఎన్నికల వ్యయంపై ప్రత్యేక ఖాతా నిర్వహించాలి 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిపై  సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నియమావళిని పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టంచేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు.

ఈ వర్క్‌షాప్‌లో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్‌.ఎన్‌. హరేంధిర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్‌సీపీ), ఎ.రాజేంద్రప్రసాద్‌ (టీడీపీ), ఐ.కె.అన్నపూర్ణ (బీజేపీ), వె.వి.రావు (సీపీఐ–ఎం) పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రి­య, వ్యయ పర్యవేక్షణ ఎంతో కీలకమైన అంశాలని చెప్పారు.

ఈ అంశాలపై సమగ్ర సమాచారాన్ని పవ­ర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా  వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్‌ మాత్రం ఐదారు రోజుల తరువాత వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మీనా వివరించిన నియమావళిలో ప్రధానాంశాలు.. 

ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి పొందాలి 
పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే అన్ని కా>ర్యక్రమాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం 
    కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధం 
అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధం 
    స్టార్‌ క్యాంపెయినర్లు రూ. లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదు 
    పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్‌ చేస్తాం 
    ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది 
    ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగానీ లేదా ఆర్‌.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులు అనుమతించం 
    ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు 
   నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తాం 
    అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తాం 
    ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది 
   ప్రతి లోక్‌సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుంది 
   ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాలి 
    ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమతులు, లిక్కరు, ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం 
    ఎన్నికల వ్యవయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాలి 
    రోజువారీ రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement