1,366 టన్నుల సబ్సిడీ ఉల్లి పంపిణీ
వ్యాపారుల నుంచి కొని తక్కువధరకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఖజానాపై ఎంత భారం పడినా ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉల్లిపాయలు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఇప్పటికే 1,366 టన్నులు సబ్సిడీ ధరకు విక్రయించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ఉల్లిపాయలు సరఫరా చేయలేమని చేతులెత్తేయడంతో భారమైనా మహారాష్ట్రలోని ప్రైవేట్ డీలర్లు, మన రాష్ట్రంలోని కర్నూలు, తాడేపల్లిగూడెం వ్యాపారుల నుంచి ఉల్లి కొనుగోలు చేస్తోంది.
దసరా, దీపావళి పర్వదినాల్లో వినియోగదారులు ఇబ్బంది పడకుండా కిలో రూ.65 నుంచి రూ.70 ధరకు 529 టన్నులు కొనుగోలు చేసింది. ఒక్కో వినియోగదారుకు రెండు కిలోల వంతున కిలో 40 రూపాయలకే విక్రయించింది. ప్రభుత్వం మీద కిలోకి రూ.30 భారం పడింది. రానున్న రోజుల్లోనూ నాఫెడ్ నాణ్యమైన ఉల్లిని సరఫరాచేసే అవకాశాలు లేకపోవడంతో వ్యాపారుల వద్దే కొనేందుకు మార్కెటింగ్శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.