పరిశ్రమలకు ఆధార్‌!  | Department Of Industry Conducts Comprehensive Industry Survey 2020 | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు ఆధార్‌!

Aug 14 2020 9:05 AM | Updated on Aug 14 2020 9:07 AM

Department Of Industry Conducts Comprehensive Industry Survey 2020 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాలను గుర్తించేందుకు పరిశ్రమలశాఖ ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర పరిశ్రమ సర్వే2020 (ఎస్‌పీఎస్‌)’ని చేపట్టింది. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమగ్ర సర్వేను చేపడుతున్నారు. అక్టోబర్‌ 15కల్లా సర్వే పూర్తి చేసి అదే నెల 30వ తేదీలోగా పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సర్వే కోసం ప్రత్యేక బృందాలు..  
►సర్వే సందర్భంగా రాష్ట్రంలో పతి పరిశ్రమకు ఆధార్‌ తరహాలో 11 అంకెలతో ప్రత్యేక సంఖ్యను కేటాయించి తొమ్మిది రకాల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు.  
►సర్వే పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. (అమరావతికి నిధుల సమీకరణ)
►సర్వే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పిస్తారు.  
పరిశ్రమ ఆధార్‌ అంటే...?
►పరిశ్రమలకు ఆధార్‌ తరహాలో కేటాయించే 11 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్య ద్వారా అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ఏ జిల్లాలో ఉంది? అనే వివరాలను సులభంగా గుర్తించవచ్చు. 
►11 డిజిట్స్‌లో మొదటి మూడు జిల్లాను, తర్వాత రెండు అంకెలు మండలాన్ని సూచిస్తాయి. తదుపరి సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ? అనే విషయాన్ని తెలియచేస్తుంది. చివరి  5 డిజిట్స్‌ సీరియల్‌ నంబర్‌ ఉంటాయి. ఇలా రాష్ట్రంలోని చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు.    

Advertisement
 
Advertisement
Advertisement