
శిశువును చూపిస్తున్న ఈఎంటీ కిరణి
బనగానపల్లె రూరల్: కరోనా పాజిటివ్ వచ్చిన ఓ గర్భిణి 108లోనే ప్రసవించింది. అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) కిరణి చొరవ తీసుకుని ఆమెకు సుఖప్రసవం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం అలమూరుకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో బనగానపల్లె కమ్యూనిటీ వైద్యశాలకు తెచ్చారు. ఆమెకు రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్గా తేలింది.
ఈ విషయం తెలుసుకున్న కమ్యూనిటీ వైద్యశాల సిబ్బంది ఆమెకు ఇక్కడ ప్రసవం చేయడం కష్టమని, వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. 108 వాహనంలో ఎక్కించాక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను బనగానపల్లె వైద్యశాలలో చేర్పించారు.