ఇది రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం 

CM YS Jagan Release YSR Sunna Vaddi Scheme Funds - Sakshi

సకాలంలో రుణం చెల్లిస్తే సర్కారే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసం రైతుల్లో కలిగించాం

వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

14.58 లక్షల మంది రైతులకు రూ.510.32 కోట్లు చెల్లింపు

అక్టోబర్‌లో పంట నష్టపోయిన 1.97 లక్షల మందికి రూ.132 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు

మాట చెబితే ఆ మాటపై నిలబడతామనే నమ్మకం కల్పించాం

ఎన్నికల్లో చెప్పకపోయినా రైతుల బాగు కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇస్తోంది

గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ రూ.1,180 కోట్లు చెల్లించాం

రైతులు, అక్కచెల్లెమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ

ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన.. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం

మాట నిలబెట్టుకున్నందునే ప్రజా ప్రతినిధులు తలెత్తుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే 90 శాతం వాగ్దానాలను అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. 

సాక్షి, అమరావతి: ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసం రైతుల్లో కలిగించామన్నారు. మాట చెబితే ఆ మాటపై నిలబడతామనే నమ్మకం కల్పించామని చెప్పారు. 2019 ఖరీఫ్‌కు చెందిన 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.132 కోట్లను చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైఎస్‌ జగన్‌ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రైతులు, అక్కచెల్లెమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ తొలి దశలో మూడు జిల్లాల్లో ఈ నెల 26 నుంచి చేపడుతున్నామన్నారు. ‘ఈ రోజు నిజంగా మరో ఘట్టం. రైతులకు మంచి చేసే విషయంలో ఎంతో సంతోషం కలిగించేది. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుందన్న నమ్మకం కలుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదు. మొదటిసారిగా ప్రభుత్వంపై విశ్వసనీయత కలుగుతోంది. ఆ నమ్మకం ఇవ్వగలుగుతున్నాం’ అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

18 నెలల్లో 90 శాతం హామీలు అమలు
ఈ నెలాఖరుకు మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఎన్నికల హామీలు ప్రకటించి, ఆ తర్వాత దాన్ని పట్టించుకోని వారిని చూశాం. కానీ మనం మన మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ లా భావించి 90 శాతం హామీలు అమలు చేశాం.
 రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ 14.58 లక్షల రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.510 కోట్లు జమ చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాను.

ఆర్బీకేలు - రైతు భరోసా 
 రైతు భరోసా కేంద్రాల గురించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా ఏర్పాటు చేశాం. నవరత్నాలులో తొలి మాట రైతు భరోసా రూ.12,500కు బదులుగా రూ.13,500 ఇస్తున్నాం. నాలుగేళ్లకు బదులుగా 5 ఏళ్లు ఇస్తున్నాం. వరసగా రెండో ఏడాది కూడా జమ చేశాం. 
 రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు రైతు భరోసా అందుతోంది. 

గతంలో ఏం జరిగింది? 
గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015-16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. 
2015-18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. 

మనం ఏం చేస్తున్నాం? 
ఏ సీజన్‌లో పంట నష్టాన్ని అదే సీజన్‌లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం.
అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది.
వైఎస్సార్‌ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. వారికి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 

అర్హత ఉండి రాకపోతే..
అర్హత ఉన్నప్పటికీ ఇప్పుడు లబ్ధి కలగకపోతే కంగారు పడొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది. అర్హుల జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించాం. ఎవరికైనా మిస్‌ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. 155251 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు. 
అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా మిగిలి పోకూడదని ఆరాటపడే ప్రభుత్వం ఇది. అందుకే ఈ నెలలోనే వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించాం. పలు పథకాల్లో కొత్త వారికి ప్రయోజనం కల్పించాం.

రైతుల కోసం ఎన్నెన్నో..
గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8655 కోట్లు ఉచిత విద్యుత్‌ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1180 కోట్లు ఇస్తున్నాం.
రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్‌ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు.

వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్‌
పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్‌ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్‌ డిసెంబర్‌లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది.

నాణ్యమైన ఎరువులు, విత్తనాలు 
13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షించి, నిర్ధారించి అందిస్తున్నాం. గతంలో ఏనాడూ ఇది జరగలేదు. దీంట్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని, థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ చేయించి క్వాలిటీ చూడాలని చెప్పాం.

26 నుంచి అమూల్‌ పాల సేకరణ 
రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్‌ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. 
పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్‌బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం.
 
పంటల కొనుగోలు 
2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్‌ సమయంలో రూ.3,200 కోట్లతో బత్తాయి, అరటి, మొక్కజొన్న, సజ్జ, పొగాకు, ఉల్లి, పసుపు, టమాట తదితర పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం.
అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మీకు ఏ సమస్య వచ్చినా మీ బిడ్డ తోడుగా ఉంటాడని చెబుతున్నాను. దేవుడు రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 
ఈ కార్యక్రమంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు పాల్గొన్నారు. 

ఎంతో ఆశ్చర్యపోతున్నాం
సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్‌ జగన్‌) వచ్చాక సీజన్‌లోనే వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అక్టోబర్‌లో జరిగిన పంట నష్టానికి నెల రోజుల వ్యవధిలోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారు. అందుకు మీకు రైతుల తరఫున కృతజ్ఞతలు.
- కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

మీ హయాంలో సాగు సులభమైంది
మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. పిల్లలు కూడా వదిలేయమన్నారు. రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ. 3,218 వడ్డీ మాఫీ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో లక్షకు రూ.2 వేలు పై చిలుకు మేమే ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్లం. కానీ ఇప్పుడు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కూడా మీరే కడుతున్నారు. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు.
- ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా

మీ పట్ల నమ్మకం పెరిగింది
గ్రామ సచివాలయాలు ఓ చరిత్ర, అద్భుతంగా పని చేస్తున్నాయి. ఎక్కడ నుంచి ఇన్ని పథకాలకు మీరు డబ్బులు తెస్తున్నారని అడుగుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ రాయితీ ఇస్తుందని మీ పనితీరు ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే.
- విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా
 
రైతుల పాలిట మీరు దేవుడు
గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను
ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్‌ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. గతంలో ఈ డబ్బులు రెండేళ్లైనా వచ్చేవి కావు. మీ వల్ల అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. 
- శ్రీధర్‌, ఆత్మకూరు, అనంతపురం జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top