‘చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు’ | Chevireddy Bhaskar Reddy releases open letter to SIT officials | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు’

Jun 19 2025 4:07 AM | Updated on Jun 19 2025 4:07 AM

Chevireddy Bhaskar Reddy releases open letter to SIT officials

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 

సిట్‌ అధికారులను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం కోసమే పోలీసులు తనపైన, తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. లేని లిక్కర్‌ స్కాంను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో సిట్‌ అధికారులు అక్రమంగా అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో బుధవారం బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ఆయన చిన్న కుమారుడు హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్‌ కార్యాలయం వద్ద మీడియా ముఖంగా బహిర్గతం చేశారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఇదీ.

‘ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు వస్తానని చెప్పా’
‘మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ సిట్‌ కార్యాలయానికి వస్తాను అని నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు కేవలం నా సెల్‌ఫోన్‌కు ఒక చిన్న మెసేజ్‌ పెట్టి ఉన్నా మీ సిట్‌ కార్యాలయం ముందు నిలబడి ఉంటా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పి ఉంటా. నేను పగలే కాదు.. రాత్రివేళ కూడా ఏ రోజూ నా సెల్‌ఫోన్‌ ఆఫ్‌ చేయలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నా. మీరు పిలిచి ఉంటే వచ్చేవాడిని. నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. ముందస్తు బెయిల్‌ కూడా నా జీవితంలో ఏనాడూ అడగలేదు. అలాంటి నాపై లుకౌట్‌ నోటీసులు ఇవ్వడం అన్నది మీ సభ్యతను తెలియజేస్తోంది.

బతుకుతెరువు కోసం అవకాశం ఉన్న ప్రదేశాలకు, దేశాలకు వెళుతుంటాం తప్పేంటి?. మీరు పిలిస్తే రానప్పుడు తప్పు అవుతుంది. కానీ నేను అలా చేయలేదు కదా!. సిట్‌ విచారణ ప్రారంభించి 365 రోజులవుతుంది. ఏ రోజయినా, ఏ ఒక్కరైనా, చివరకు ఏ పేపర్, ఏ చానల్‌ అయినా నిన్నటివరకు నా పేరు ప్రస్తావించిందా? లేదుకదా. కనీసం నిన్నటి వరకు మీ సిట్‌ అధికారులు ఒక్కరైనా నన్ను ఏదైనా అడిగారా?. ఒక చిన్న నోటీస్‌ అయినా ఇచ్చారా?. ఎప్పుడైనా పిలిచారా?. లేదు కదా! అంటే దాని అర్థ ఏంటీ!.’

‘చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది’
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా నన్ను ఎలా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో, ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనేకసార్లు ఎంతగా కొట్టించారో మీకు తెలు­సు, ప్రజలందరికీ తెలుసు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇక మిగిలింది.. మా పాత గన్‌మెన్‌లను తప్పుడు కేసులకు సంతకాలు పెట్టమని మీ సిట్‌ అధికారులు కొట్టినట్టు మీ చేత మళ్లీ నన్ను కూడా కొట్టిస్తారేమో!. అది కూడా కానిచ్చేయండి. 

చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది. ఈసారి నా ఒక్కడినే కాదు.. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని కేవలం 26 సంవత్సరాలు వయసు గల నా కొడుకు మోహిత్‌రెడ్డిని కూడా కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంటున్నట్టు ఉన్నారు. ఒక్క మోహిత్‌నే ఎందుకు. ఇంట్లో ఇంకా నా భార్య, నా మరో కొడుకు కూడా మిగిలి ఉన్నారు. వాళ్లను కూడా దయచేసి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపి చంద్రబాబును, చంద్రబాబు కుటుంబాన్ని సంపూర్ణంగా శాంతింపచేయండి. 

మాకేం పర్లేదు. మా కుటుంబం అంతా నిత్యం కొలిచే మా వెంకటేశ్వరస్వామి మాలో ఉన్నాడు.  జీవితం అంతా పోరాటాలే ఊపిరిగా జీవిస్తున్న మా జగనన్నే మాకు స్ఫూర్తిగా ఉన్నాడు. ధైర్యం ఉంది. ఎదుర్కొంటాం. సగౌరవంగా తిరిగి వస్తాం. ఆలస్యమైనా సత్యమే జయిస్తుంది అని చెవి­రెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

నన్ను, నా తల్లిని కూడా అరెస్ట్‌ చేయండి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్‌రెడ్డి
విజయవాడ స్పోర్ట్స్‌: ‘లేని మద్యం కేసును తెరపైకి తెచ్చి అందులో నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఇదంతా సీఎం చంద్రబాబు కుట్ర. అక్రమ అరెస్టులతో మా కుటుం­బంపై రాజకీయ కక్ష సాధింపులకు దిగారు. ఈ కేసుతో మా నాన్నను, అన్నను ఇబ్బంది పెడుతున్నారు. ఇక మా కుటుంబంలో నేను, నా తల్లి మాత్రమే మిగిలి ఉన్నాం. ఇంకెందుకు మా ఇద్దర్నీ కూడా అరెస్ట్‌ చేయండి’ అని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్‌రెడ్డి వాపో­యారు. న్యాయవాది ఎం.వాణితో కలిసి హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి బుధవారం వచ్చారు. 

అనంతరం మీడియాతో హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అత్యాచారానికి గురైన బాలికను, అన్యాయ­మైపోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తన తండ్రి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారన్నారు. ఈ ఘటనతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధం లేదని సాక్షాత్తు బాలిక తండ్రే బహిరంగంగా వెల్లడించారని గుర్తు చేశారు ఆయన తమను పరామర్శించేందుకు వచ్చారే తప్ప ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించిన తరువాత ఈ కేసును తీసేశారని చెప్పారు. 

మేమెప్పుడూ మద్యాన్ని పంచలేదు కూడా..
‘మద్యం అంటేనే మా కుటుంబానికి పడదు. మద్యం మహమ్మారి మా తాతయ్యను పొట్ట­న పెట్టుకుంది’ అని హర్షిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా ఏనాడూ తాము మద్యం పంపకం చేయలేదని వెల్లడించారు. అలాంటిది తమ కుటుంబ సభ్యులపై మద్యం కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు. తన తండ్రి, అన్నను మద్యం కేసుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అక్రమ కేసులకు భయపడి ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement