భయం వద్దు.. ధైర్యమే సగం బలం 

Bhumana Karunakar gave courage to Covid victims at Rua Hospital - Sakshi

రుయా ఆస్పత్రిలో బాధితులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే భూమన

తిరుపతి తుడా: కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యమే సగం బలం అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిని సందర్శించారు. పీపీఈ కిట్‌ ధరించి వచ్చిన భూమన కోవిడ్‌కు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు సేవలు అందిస్తున్నారని, ఎన్నో జీవితాలను నిలబెడుతున్న వైద్యులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

వారిని విమర్శిస్తే దేవుడిని విమర్శించినట్లేనని చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు మించి రుయాలో రికవరీ రేట్‌ నమోదైందని తెలిపారు. సుమారుగా 100 మంది కరోనా బాధితులను నేరుగా పలకరించినట్లు చెప్పారు. వైద్యం పట్ల, వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్‌ చైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్‌రాయల్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top