తురకా కిషోర్‌ అరెస్టుపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు | AP High Court orders release of Turaka Kishore | Sakshi
Sakshi News home page

తురకా కిషోర్‌ అరెస్టుపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Aug 7 2025 3:14 PM | Updated on Aug 7 2025 5:13 PM

AP High Court orders release of Turaka Kishore

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. కిషోర్‌ రిమాండ్‌ రిపోర్టును సస్పెండ్‌ చేసింది.

తురకా సురేఖ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గతవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు వరుసగా విచారణ చేపట్టింది. 

ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కిషోర్‌ అరెస్టుపై తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా తురకా కిషోర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనల్ని పూర్తిగా తుంగలోకి తొక్కారు. సుప్రీం కోర్టు గైడ్‌ లైన్స్‌ను కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 రెంటచింతల పోలీసులకు హైకోర్టు ఆదేశాలు 
ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.

బెయిల్‌ పిటిషన్‌ వేయకుంటే  రిమాండ్‌ విధించేస్తారా..? 
బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిషోర్‌ను రిమాండ్‌కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులనూ మరోసారి పరిశీలించింది. అరెస్టయిన కిషోర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు కాబట్టి, తాను రిమాండ్‌ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపింది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయకుంటే, రిమాండ్‌ విధించేస్తారా? మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ మేజిస్ట్రేట్ తీరును ప్రశ్నించింది.

పరస్పర విరుద్ధమైన వాదనలేంటి..? 
‘రిమాండ్‌ రిపోర్ట్‌ తీసుకునేందుకు కిషోర్‌ తిరస్కరించారని మీరు (పోలీసులు) చెబుతున్నారు. కానీ మేజిస్ట్రేట్‌ తన ఉత్తర్వుల్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మీ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కింది కోర్టులో కిషోర్‌ ఏ కాగితాలను తీసుకోలేదని చెబుతారు. మరోవైపు తీసుకున్నట్లు కిషోర్‌ సంతకం చేసినట్లు చెబుతారు. ఏంటీ పరస్పర విరుద్ధమైన వాదనలు? నేరాంగీకార వాంగ్మూలంపై కిషోర్‌ సంతకం చేయలేదని అంటున్నారు. మీరు చెబుతున్నట్లు అతను కరడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలూ చేసేశానంటూ ఒప్పేసుకుని సంతకం చేస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచకూడదు 
ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదు.. అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎస్‌జీపీ విష్ణుతేజ కోరగా.. ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.  

	తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

అప్పటి వరకు కిషోర్‌ను జైల్లోనే ఉంచమంటారా?
అప్పటి వరకు కిషోర్‌ను జైల్లోనే ఉంచమంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పలు కేసుల్లో కిషోర్‌ను అరెస్ట్‌ చేయాల్సి ఉందని విష్ణుతేజ చెప్పగా, వాటితో తమకు సంబంధం లేదని, తమ ముందున్న కేసుతోనే తమకు సంబంధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే, ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేస్తారా.. అంటూ ప్రశ్నించింది.

అలాగే రెండు, మూడేళ్ల క్రితం ఘటనలు జరిగితే ఇప్పుడు అరెస్ట్‌లు చూపారంది. కిషోర్‌ అరెస్ట్, రిమాండ్‌ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల కిషోర్‌ విడుదలకు ఆదేశాలిస్తామంది. విష్ణుతేజ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్‌ రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేయలేదని తెలిపారు.

అలా అయితే రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్‌లో సవరణ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డికి సూచించింది. దీంతో కిషోర్‌ అరెస్ట్‌ను, రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా సురేఖ ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్‌ మధ్యాహ్నం విచారణకు రాగా, దీనిపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది.

జైలు నుంచి విడుదల కానున్న తురకా కిషోర్‌ 
అయితే ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు తురకా కిషోర్‌ అరెస్టులో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం నిబంధనల్ని సైతం తుంగలో తొక్కారని వ్యాఖ్యానిస్తూ కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలతో తురకా కిషోర్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement