సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 20 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా రూపుదిద్దుకోనున్నాయి. అత్యంత రద్దీ ఉన్న కీలక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ కృషితో ఇటీవలే రాష్ట్రంలో ఏడు రహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది. మొత్తం 485.65 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని రెండు విడతలుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. దాంతో ప్రతిపాదించిన వాటిలో 688. కి.మీ. మేర 11 రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరో 9 రహదారులపైనా కేంద్రం సానుకూలం 889.06 కి.మీ. మేర మరో 9 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దీనిపై త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.