శ్రీరాంసాగర్‌ నుంచి సీతమ్మసాగర్‌ వరకు.. | Andhra Pradesh Government clarified once again to Godavari Board | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌ నుంచి సీతమ్మసాగర్‌ వరకు..

Jan 25 2022 3:47 AM | Updated on Jan 25 2022 3:47 AM

Andhra Pradesh Government clarified once again to Godavari Board - Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి ప్రధాన పాయపై శ్రీరాంసాగర్‌ నుంచి సీతమ్మసాగర్‌ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగుకే బోర్డు పరిధిని పరిమితం చేయాలని తెలంగాణ సర్కార్‌ తేల్చిచెప్పింది. పరిధిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడాన్ని బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ దృష్టికి తీసుకెళ్లామని సబ్‌ కమిటీ కన్వీనర్‌ బీపీ పాండే తెలిపారు.

గోదావరి బోర్డు పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సోమవారం వర్చువల్‌ విధానంలో సమావేశమైంది. బోర్డు నోటిఫికేషన్‌లోని షెడ్యూల్‌–2 కింద ఉన్న ప్రాజెక్టుల సమాచారాన్ని తక్షణమే అందజేయాలని సబ్‌ కమిటీ కన్వీనర్‌ బీపీ పాండే కోరారు. ఇప్పటికే ప్రాజెక్టుల సమాచారం ఇచ్చామని ఏపీ తరఫున సమావేశంలో పాల్గొన్న గోదావరి డెల్టా సీఈ పుల్లారావు వివరించారు. తెలంగాణ సర్కార్‌ ఇప్పటికీ ప్రాజెక్టుల సమచారాన్ని ఇవ్వకపోవడంపై కన్వీనర్‌ బీపీ పాండే అసహనం వ్యక్తం చేశారు. దాంతో తమ ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టుల సమాచారాన్ని ఇస్తామని తెలంగాణ సీఈ మోహన్‌కుమార్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement