
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబర్లీ సాగుదారులు విలవిల
వేల ఎకరాల్లోని పంట కొనేవారు లేక తీవ్ర ఆందోళన
బంగారం కుదవపెట్టి.. అప్పులు తెచ్చి మరీ సాగు
ఎకరాకు కౌలుతో సహా రూ.లక్షన్నర వరకు పెట్టుబడి
ముందు మాట ఇచ్చి.. తర్వాత సిండికేట్ అయిన కంపెనీలు
కంపెనీలతో కొనిపిస్తామంటూ ప్రభుత్వం డాంభికాలు
తాము కూడా కొనుగోలు చేస్తామంటూ హడావుడి
తీరా పంట చేతికి వచ్చే దశలో ఎవరూ కొనని పరిస్థితి
కంపెనీలు కొన్నది ఇప్పటికి 24 వేల టన్నులు మాత్రమే
రైతుల వద్ద పేరుకుపోయిన 55 వేల టన్నుల పంట
కళ్లాలు, ఇళ్లలో నిల్వలు.. కూలీ ఇవ్వడానికీ డబ్బుల్లేక గగ్గోలు
మిర్చి తరహాలోనే ప్రభుత్వం మోసగిస్తోందని ఆందోళన
కొనకపోతే ఈ ఖరీఫ్లో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన
నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది. బంగారం కుదవపెట్టి రూ.4 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా.
నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా రూ.15వేలు–18 వేల మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు. కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం. పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. – గెద్దల నాగబాబు, బాపట్ల జిల్లా వంకాయలపాడు
(బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి) : నాలుగు జిల్లాలు.. దాదాపు లక్ష ఎకరాల్లో పంట.. వేలమంది రైతులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు..! బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యథ. ‘‘గతేడాది వరకు మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్దఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్డీ బర్లీ) సాగు చేశాం.
పంట పండాక ప్రభుత్వం, కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి’’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు, కూలీల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరా సాగుకు రూ.లక్షన్నర అయిందని.. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సగటున 10–12 క్వింటాళ్లకు పడిపోయిందని వారు వాపోతున్నారు. ఐడీ నంబర్లు ఇచ్చి మరీ సాగుచేయించిన పొగాకు కంపెనీలు.. డిమాండ్ లేదనే సాకుతో పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళ్లుమూసుకున్న కూటమి ప్రభుత్వం
సీఎం యాప్ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లీ రైతులను గాలికొదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది.
నల్లబర్లీకి సాధారణంగా డిసెంబరు నుంచి ఆకు కొట్టడం మొదలుపెట్టి మార్చి ఆఖరుకు పూర్తిచేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్కు దాదాపు పూర్తవుతాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్కు తెస్తుంటారు. ఈసారి జూన్ తొలివారంలోనూ కనీసం మూడో వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది.
పంట అమ్మితేనే కూలీ డబ్బులిచ్చే దుస్థితి
పంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేశారు. పైన పట్టాలు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొట్టడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే కానీ వీరికి సొమ్ములివ్వలేని పరిస్థితి. ఇటుచూస్తే క్వింటా రూ.7 వేలకు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష నష్టపోతున్నారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్ సాగుకు దూరంగా ఉండాలని (క్రాప్ హాలిడే) భావిస్తున్నారు.
కూటమి కార్యకర్తలకు మేలు చేసేందుకే
కంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లీ సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా... వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి రెండు నెలలు గడుస్తోంది.
ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లీ పంట చేలల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి అంచనా వేయగా, గ్రేడ్లను బట్టి 85 వేల టన్నులు మార్కెట్కు వస్తుందని లెక్క. కానీ, ఇప్పటివరకు అదీ అతికష్టమ్మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు (క్వింటాళ్లు) తీసుకెళ్తే 3–4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. రైతుల వద్ద మరో 55 వేల టన్నుల పంట ఉంది. గత నెలలో వర్షాలకు పొగాకు దెబ్బతిన్నది. పంట నాణ్యత
రోజురోజుకు తగ్గుతోందని రైతులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు వత్తాసు పలికేలా వ్యవహరించింది. మిర్చి మాదిరిగానే కాలయాపన చేస్తూ పొగాకు రైతులను కంపెనీలకు వదిలేసింది. ఓవైపు ధర లేక రైతులు ఆత్మహత్య యత్నాలు చేస్తుండగా, మరోపక్క పొగాకు బేళ్లను తగలబెడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు.
నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించినా ఏ ఒక్కటీ కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాగా, ఏ గ్రామంలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎంత దిగుబడి వచ్చింది..? ఎంత అమ్ముకున్నారు..? రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది? అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తున్నాయి.
నాడు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం
» నేరుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి చర్యలు
» తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు
» 30 వేల మంది నుంచి రూ.139 కోట్ల పంట కొనుగోలు
నల్లబర్లీ పంట విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20 సీజన్లో మార్కెట్లో ధర లేని సమయంలో ఏపీ మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. తేమ శాతంతో సంబంధం లేకుండా 30 వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. 2022–23లో 1.42 లక్షల టన్నుల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతివ్వగా, మాండూస్ తుపాన్తో సగానికి పైగా పొగాకుతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
అదే సమయంలో పొగాకు రేటు బాగుండడంతో రైతులంతా ఇదే పంట వేశారు. ఫలితంగా 1.72 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తయింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. అలాంటిది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ కారణంగా పైసా పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం ఒప్పుకొంది. నేడు ఈ చొరవ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.
ధరల నేలచూపు.. రైతుల వద్ద పేరుకున్న నిల్వలు
నల్లబర్లీ లక్ష టన్నుల దిగుబడి వచ్చింది. పొగాకు బోర్డుతో సంబంధం లేకుండా ట్రేడర్స్, కంపెనీలు కొనుగోలు చేసే ఈ పొగాకును బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల మంది సాగు చేశారు. నిరుడు హై గ్రేడ్కు కిలో రూ.155–180 చొప్పున ధర లభించగా, ఈ ఏడాది రూ.70–80 మించడం లేదు.
లో గ్రేడ్ గత ఏడాది కిలో రూ.80–100 ధర పలకగా, ఇప్పుడు రూ.30–45కు మించి కొనేవారు లేరు. రాష్ట్రంలో 21 పొగాకు కంపెనీలు ఉన్నాయి. జీపీఐ, ఐటీసీతో సహా ఏడు కంపెనీలు రైతుల నుంచి నేరుగా, మరో 12 ట్రేడర్స్ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తాయి. కానీ, ఈ ఏడాది కంపెనీలన్నీ సిండికేట్గా మారి రైతులను నిలువునా ముంచేశాయి.
ఎకరాకు రూ.60 వేలు నష్టం తప్పేలా లేదు
బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలానికి చెందిన వంకాయలపాటి లోతుబాబు ఈ ఏడాది 3.5 ఎకరాల్లో నల్లబర్లీ వేశారు. గత ఏడాది ఎకరంలో పొగాకు పండించి రెండెకరాల్లో మిరప వేశారు. పంట దెబ్బతినడంతో తీసేసి మొక్కజొన్న పండించారు. ఈ ఏడాది నల్లబర్లీ ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి కాగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
పొగాకు పండించమంటూ కంపెనీల వాళ్లు వచ్చి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టారు. కానీ, ఒక్కరూ కొనడం లేదు. లోతుబాబు ఒక్క కేజీ కూడా అమ్మలేదు. ‘‘శనగ వేసుకున్నా మా డబ్బులు మాకు వచ్చేవి. ఎకరాకు రూ.60 వేలకు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది’’ అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.
నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి
నేను 10 ఎకరాల్లో నల్లబర్లి పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టా.10 క్వింటాళ్లు వచ్చింది. కంపెనీ వాళ్లు కొంటామని చెప్పారు. నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి ఇచ్చేశారు. ఒక్క చెక్ కూడా ఇప్పటి వరకు కొనలేదు. నా దగ్గర దాదాపు 100 క్వింటాళ్ల పంట ఉంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – భవనం వెంకటరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా
గ్రేడింగ్ రావడం లేదని..
3 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశా. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కౌలుకే రూ.27 వేలు అప్పులు చేసి ఇచ్చాను. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేశాను. 30 క్వింటాళ్ల పంట ఉంది. ఐదు చెక్లు తీసుకెళ్తే రెండు వెనక్కి ఇచ్చేశారు. చెక్కు చేరా రూ.1000 ఖర్చవుతోంది. క్వింటాకు గ్రేడ్ చేసి తొక్కాలంటే రూ.500. ఇక 10 క్వింటాళ్లు గ్రేడింగ్ చేస్తే 3 క్వింటాళ్లు బాగుంది. మిగిలింది గ్రేడింగ్ రావడం లేదు. కొనేవారు లేక ఇంటి వద్దే ఉంచా. – కాసు కోటిరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా
పురుగుమందుల షాపులకే రూ.7లక్షలు కట్టాలి..
11 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. నిరుడు క్వింటా రూ.15,500కు కొన్నారు. ఈ సారి రూ.6–8 వేలకు కూడా తీసుకోవడం లేదు. పురుగుమందుల దుకాణం వాళ్లకే రూ.7 లక్షలు ఇవ్వాలి. బంగారం పూర్తిగా బ్యాంక్లోనే ఉంది. నిరుడు ఎకరాకు రూ.50వేలు మిగిలింది. ఈసారి ఎకరాకు రూ.50–70 వేలు నష్టపోతున్నాం. – ఎర్రం సుబ్బారెడ్డి, ఇంకొల్లు, బాపట్ల జిల్లా
పొగాకు రైతు ఆత్మహత్య
» ప్రకాశం జిల్లా కొండపిలో విషాదం
» పంట సాగులో నష్టాలతో మనస్తాపం
కొండపి: పొగాకు పంట సాగు చేసి నష్టాలు రావడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్రెడ్డి (43) పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే వేలం ప్రారంభం నుంచి పొగాకుకు గిట్టుబాటు ధర లేదని కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇలాగైతే పంటసాగుకు చేసిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం లేదని వాపోయాడు.
ఈ క్రమంలో నాలుగో తేదీన కొండపికి వెళ్తున్నానని, సాయంత్రానికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మధుసూదన్రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్రెడ్డిదిగా గుర్తించారు. మృతుడి కుమారుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీంటిపర్యంతమయ్యాడు.
ఈ ఘటనపై చల్లా మధుసూదన్ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం రైతు ఆత్మ హత్యగా కాకుండా, రూ.200 కోసం తల్లిదండ్రులతో గొడవపడి నెన్నూరు పాడు నుంచి వచ్చి కొండపిలోని పొగాకు బోర్డు సమీపం ఒక పాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసినట్టు సమాచారం.
పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
సాక్షి, అమరావతి: రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఇచి్చన హామీ లాగా బుట్టదాఖలు చేయకుండా రైతుల వద్ద ఉన్న చివరి కిలో పొగాకు వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. పొగాకుతో పాటు మామిడి, కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలు దగా చేస్తున్నాయని ఆరోపించారు.