రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం
మిగతా 2,789 పంచాయతీలకు 13న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు
పోటీలో 7,510 మంది అభ్యర్థులు
వార్డు పదవులకు 12,605 ఏకగ్రీవం.. 20,965 చోట్ల పోటీ
సాక్షి, అమరావతి: రెండో విడతలో 2,789 గ్రామ సర్పంచ్ పదవులకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద మొత్తం 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా.. అందులో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,789 సర్పంచ్ పదవులకు గాను 7,510 మంది పోటీలో ఉన్నారు.
ఆయా గ్రామాల్లో మొత్తం 33,570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 12,605 ఏకగ్రీవమవగా, మిగతా 20,965 వార్డు పదవులకు 13న పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి గడువు గురువారం రాత్రి 7:30 గంటలతో ముగుస్తుంది. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కిస్తారు.