ఆగిపోయిన అంబులెన్స్ వద్ద సహాయం కోసం సిబ్బంది నిరీక్షణ
నడిరోడ్డుపై ఆగిపోయిన 108
అందులో ప్రాణాలతో పోరాడుతున్న 800 గ్రాముల పసికందు
సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలపై విమర్శలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లెకు చెందిన జ్యోత్స్న 7వ నెలలోనే పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా అడ్మిటై, 800 గ్రాముల బరువున్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని, వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో తల్లి, బిడ్డను 12.15 సమయంలో అంబులెన్స్లోకి ఎక్కించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను అంబులెన్స్ వెంటిలేటర్పై ఉంచారు. మురకంబట్టు వద్దకు వెళ్లగానే అంబులెన్స్ ఆగిపోయింది. మరో 108ను 60 కి.మీ. దూరం ఉన్న పీలేరు నుంచి పిలిపించారు. వాహనం వచ్చే వరకూ 2 గంటలపాటు తల్లి, బిడ్డ నడిరోడ్డుపై నరకయాతన పడ్డారు. అనంతరం అంబులెన్స్ రావడంతో తల్లి, బిడ్డను తిరుపతికి తరలించారు. ప్రస్తుతం బిడ్డను రుయా ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి, వైద్యులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


