● మాజీ మంత్రి సాకే శైలజానాథ్
శింగనమల: ఎల్–నినో ప్రభావం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం వల్లే పంటలు నీరందక ఎండుముఖం పట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. శనివారం ఆయన శింగనమల మండలం నాగులగుడ్డం, వెస్ట్ నరసాపురం, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామాల్లో పంటలను పరిశీలించారు. ఎండిపోతున్న పంటలను చూపుతూ రైతులు కన్నీరు పెట్టడంతో ఆయన చలించిపోయారు. ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా కల్పించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోవడంతో వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. వర్షాలు పడడమే ఒక సమస్య కాదని, సకాలంలో నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు హామీలు కాదని, వారికి కావల్సింది నీరని అన్నారు. రైతులు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని, వారి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. హెచ్చెల్సీ దిగువ ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్ట పరిహారం, పంటల బీమాను రైతులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పరంధామరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన శ్రీరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్రెడ్డి, నాయకులు కంచిరెడ్డి భాస్కర్రెడ్డి, శ్రీనావాసులు నాయక్, భాస్కర్రెడ్డి, గురుమూర్తి రెడ్డి, మధు, నారాయణ, జగన్, బండి శ్రీనివాసులు, శివమ్మ, వెంకటరాముడు, రమాదేవి, సరస్వతి, లక్ష్మీదేవి, శంకర్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజు, విజయ్, తిరుపతయ్య, వెంకటనారాయణ, కోటిరెడ్డి, బాలకృష్ణ, అబ్దుల్లా, ఆలీ, గోపాల్, వీరాంజి, చెన్నారెడ్డి, నాగన్న, శ్రీకాంత్రెడ్డి, రామకృష్ణ నాయక్ పాల్గొన్నారు.


