కళ్యాణదుర్గం రూరల్: ఊరూరా బెల్టుషాపులతో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాగునీటిని అందించడంలో తీవ్రంగా విఫలమైందని మహిళలు ఆగ్రహించారు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో 15 రోజులుగా తాగునీరు అందడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు శనివారం ఉదయం ఖాళీ బిందెలు చేతపట్టుకుని ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 4 బెల్టుషాపులు పెట్టించి మద్యం సరఫరా చేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. తాగునీటి గురించి ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అనంతరం అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
‘స్థానిక’ పోలింగ్ కేంద్రాలు 1,594
అనంతపురం న్యూ టౌన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూత్ల వివరాలను జిల్లా పరిషత్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆమోదం లభించిన జాబితాను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 31 మండలాలలో మొత్తం 450 మండల ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందుకు గాను జిల్లావ్యాప్తంగా 1,594 పోలింగ్ స్టేషన్లను తుదివిడతగా గుర్తించినట్లు జిల్లా పరిషత్ అధికారులు వివరించారు.


