అనంతపురం: అధికారం చేపట్టి 28 నెలలు గడిచినా ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రిక్తహస్తం చూపుతోందని మాజీ మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా భేగ్ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మైనార్టీ ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష అందిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. మసీదుల అభివృద్ధి, మౌజమ్, ఇమామ్లకు జీతాల పెంపు, 50 ఏళ్లకే పింఛన్, ఈద్గా స్థలాలు, శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్, నూర్ బాషా కార్పొరేషన్కు రూ.100 కోట్లు, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ తదితర హామీలు అటకెక్కించారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కితే, ముస్లిం మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పర్యటించనున్న లెజిస్లేచర్ కమిటీ మైనార్టీల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. గుంతకల్లు ప్రాంతంలో మైనార్టీ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్ భవన పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని, అలాంటి భవనాన్ని ఇతర పాఠశాల అవసరాలకు ఉపయోగించడం సముచితం కాదన్నారు. అనంతపురంలో గతంలో మైనార్టీ స్కూల్, జూనియర్ కాలేజ్, హాస్టల్ నిర్మాణం కోసం రూ.32 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ పనులు వేగవంతం కాలేదన్నారు. మైనార్టీ హాస్టల్ స్థానంలో నూతన భవనాలను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఇషాక్, రహంతుల్లా, నాయకులు ఖాదర్, ఏ1 రఫీ, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.


