శింగనమల: వినాయక చవితి పండుగను ఆనందంగా చేసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా విషాదం నిండింది. రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
డ్యాన్స్ చేస్తూ షాక్కు గురై..
శింగనమల మండలంలోని లోలూరు కురుబ కాలనీలో యువకులు వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి యువకులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. డ్యాన్స్ చేస్తున్న నాగలింగ కుమారుడు ప్రతాప్ (20)కు వినాయక మండపానికి తీసుకున్న విద్యుత్ వైరు తగలడంతో షాక్కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ప్రతాప్ మృతి చెందాడు. నాగలింగకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక్కొగానొక్క కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
హెచ్చెల్సీలో యువకుడి గల్లంతు
బొమ్మనహాళ్: వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఓ యువకుడు హెచ్చెల్సీలో గల్లంతైన ఘటన బుధవారం సాయంత్రం ఎల్బీ నగర్ గ్రామ శివారులోని గొడిసెలపల్లి రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన మేరకు.. ఉప్పరహాళ్ క్రాస్ వద్ద నివాసం ఉంటున్న శీనా కుమారుడు సాయిభరత్ (22) గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అందరూ కాలువలో స్నానం చేస్తుండగా సాయిభరత్ కూడా దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.
ప్రతాప్ (ఫైల్), నిమజ్జన వేడుకల్లో సాయిభరత్ (వృత్తంలో)
వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి
శింగనమల మండలం లోలూరులో విద్యుత్ షాక్తో యువకుడి మృతి
బొమ్మనహాళ్ మండలం ఉప్పరహాళ్ క్రాస్ వద్ద హెచ్చెల్సీలో యువకుడి గల్లంతు


