ఆత్మకూరు/ కనగానపల్లి: ఉమ్మడి జిల్లాలోని ఉరవ కొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల మీదుగా హంద్రీ–నీవా కాలువ వెళ్తుంది. అయితే కాలువకు కాంక్రీట్తో లైనింగ్ చేయడం వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా కాలువలోకి మోటర్లు వేసి నీటిని పొలాలకు తీసుకుందామని ప్రయత్నిస్తే కేసులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీలకు నీరు వదిలే ప్రభుత్వం.. పంటల సాగు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ఉపాధి కోసం వలస పోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు కంటతడి
బోర్లల్లో నీళ్లున్నాయన్న ఆశతో చాలామంది రైతులు వరి నార్లు వేసుకుని, నాట్లుకూడా వేశారు. అయితే హంద్రీ– నీవా, పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా చెరువులకు నీరు ఇవ్వకపోవడంతో పరిస్థితి తారుమారైంది. ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చెరువులకు నీరు చేరడం లేదు. క్రమేణా భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలోంచి నీరు రావడం లేదు. దీంతో పైరు ఎండిపోతుండటంతో కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతు కంటతడి పెడుతున్నాడు. నీరు లేక వ్యవసాయ భూములన్ని బీళ్లుగా మారుతున్నాయి. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే లక్ష ఎకరాల వరకు నీరందకుండా పోతోంది.
తాగునీటికీ కష్టాలే
హంద్రీ–నీవా కాలువతో పాటు పీఏబీఆర్ నుంచి కుడి కాలువ గుండా కూడా చెరువులు, కుంటలకు నీరు వదలటం లేదు. దీంతో గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. హంద్రీ–నీవా ద్వారా సాగునీటికి కాకుండా తాగునీటికి వదులుతామని చెప్పిన అధికారులు కనీసం ఈ ప్రాంతంలోని చెరువులు, నీటికుంటలకు కూడా నీరు ఇవ్వడం లేదు. దీంతో బోరుబావుల్లో నీరు రాక ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారు. కనగానపల్లి మండలం యలకుంట్ల వద్ద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండు రోజుల క్రితం తాగునీటి కోసం హంద్రీ–నీవా కాలువ వద్ద తూమును ఎత్తి నీటిని సమీపంలోని వంకలోకి వదిలారు. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి నీటిని బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు.
హంద్రీ–నీవా కాలువలో పారుతున్న కృష్ణా జలాలు
కాలువకు కాంక్రీట్ లైనింగ్తో పెరగని భూగర్భ జలాలు
చెరువులు, కుంటలకు వదలని నీరు.. బీళ్లుగా మారుతున్న పొలాలు


