తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి మద్దతుగా అనంత పురం బయలుదేరిన శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ను పెనుకొండలో పోలీసులు నిలువరించారు. హిందూపురం సమన్వయకర్త దీపికను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురంలో ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్పను పోలీసులు అడ్డుకోగా.. నేతలిద్దరూ రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి, ప్రకాష్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోలేదని, అదే తమ పార్టీ నాయకులు గాంధేయ మార్గంలో మద్దతు తెలిపేందుకు వస్తుంటే ఎక్కడికక్కడ అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అహంకారం, దురుసుతనాన్ని విడనాడాలని సూచించారు. ‘ధైర్యం ఉంటే పోలీసు బలం లేకుండా బయటకు రా.. ప్రజాస్వామ్య పద్ధతిలో తేల్చుకుందాం’ అంటూ సవాల్ విసిరారు.


