నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాల్లో కీలకమైన పెద్ద సరిగెత్తు శుక్రవారం కనులపండువగా జరిగింది. అన్ని దారులూ గూగూడు వైపు సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో గూగూడు జనసంద్రంగా మారింది. భక్తులు మొదట తలనీలాలు సమర్పించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చదివించారు. అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండంలోకి కొబ్బరి, చక్కెర, మొద్దులు వేసి మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత భక్తిశ్రద్ధలతో స్వామివారికి పానకాలు సమర్పించారు. ఫక్కీర్లు, భక్తులు అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొర్లుదండాలు పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ జగదీష్ బందోబస్తును పర్యవేక్షించారు. శనివారం పీర్ల అగ్నిగుండ ప్రవేశం, జలధి ఉంటుంది.


