కళ్యాణదుర్గం: ‘పచ్చ’ మూకల గూండాయిజాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో తాడిపత్రి’కి తరలివెళ్లేందుకు కళ్యాణదుర్గంలో సిద్ధమైన వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య, శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం వేకువజామున 5.30 గంటల నుంచే వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. పట్టణ, రూరల్ సీఐలు హరినాథ్, గణేష్ తమ సిబ్బందితో కలిసి మఫ్టీలో అక్కడ పహారా కాశారు. సాయంత్రం వరకు పోలీసులు అక్కడి నుంచి కదలలేదు. సీఐలు పలుమార్లు తలారి రంగయ్యతో చర్చలు జరిపి.. శాంతి భద్రతల దృష్ట్యా ‘చలో తాడిపత్రి’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరగా అందుకు ఆయన ససేమిరా అన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు నియోజక వర్గంలోని ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపుతప్పకుండా సీఐలు అదనపు బలగాలను రప్పించారు. పోలీసుల చర్యల కారణంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యాలయం నుంచే తమ నిరసనను తెలియజేశారు.


