● ఎస్పీ జగదీష్ పిలుపు
అనంతపురం సెంట్రల్: డ్రగ్స్ రహిత జిల్లాను నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ ర్యాలీ, మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో యువత భాగస్వాములు కావడం కీలకమన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ బాధితులకు ప్రభుత్వం ద్వారా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి తిరిగి మంచి భవిష్యత్ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి రాజశేఖర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని, యువత మత్తు మాని జీవితాన్ని గెలవాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు మహబూబ్బాషా, నాగభూషణం, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి అర్చన, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, డీఐపీఆర్వో బాలకొండయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు, ఆన్సెట్ మేనేజర్ శ్రీనివాసులు, పలువురు ప్రభుత్వ అధికారులు, కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పీఆర్ ఇంజినీర్లకు పదోన్నతులు
అనంతపురం న్యూటౌన్: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న 18 మందికి పదోన్నతి లభించింది. ఏఈలుగా పని చేస్తున్న కే.లక్ష్మి నారాయణ, బి.గోపాల్ నాయక్, బీబీఎన్ ప్రసాద్, పి.పాండురంగారెడ్డి, ఏ.లక్ష్మినారాయణ, వి.రామాంజనేయులు, ఎం.వెంకటేసులు, ఎం.ఓబుళ్దాస్, సి.ఓబుళ్దాస్, కే.వరప్రసాద్, సి.విశ్వనాథరెడ్డి, అరుణ్కుమార్, సీఆర్ మధులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. డీఈలుగా ఉన్న వై.శ్రీరాములు, నవీన్, చంద్రశేఖర్, రవికుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు పొందారు. జిల్లాలో ఈఈగా పనిచేస్తున్న జి. ప్రభాకర్రెడ్డిని కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ సూపరిండెంటెంట్ (ఎస్ఈ)గా పదోన్నతిపై బదిలీ చేశారు. ఈ మేరకు వారంతా అనంతపురం పంచాయతీరాజ్ ఎస్ఈ బాలూ నాయక్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు అందుకున్నారు.
ఆటో ఢీకొని వృద్ధుడు మృతి
నార్పల: ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గంగనపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. ముచ్చుకుంటపల్లికి చెందిన ఎ.లక్ష్మినారాయణడ్డి (70) తన సూపర్ ఎక్స్ఎల్ బైకులో వెళ్తుండగా గంగనపల్లి సమీపంలో ఆటో ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


