గుత్తి: గాంధేయ వాదిగా పేరుగాంచిన ఎద్దుల సూర్యనారాయణ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సేవా పురస్కారాన్ని ప్రదానం చేసింది. పెద్దవడుగూరుకు చెందిన సూర్య నారాయణ రెడ్డి గుత్తి కోట గౌరవ సలహాదారుగా కొనసాగుతున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సూర్యనారాయణ రెడ్డి తన తండ్రితో పాటు పాల్గొని జైలు జీవితం అనుభవించారు. పెద్దవడుగూరుకు గాంధీ వచ్చిన సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచి చందాలు వసూలు చేశారు. సూర్యనారాయణ రెడ్డి కుటుంబం స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన త్యాగాలకు గుర్తింపుగా పురస్కారం అందజేశారు. న్యూఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదగా సూర్య నారాయణ రెడ్డి పురస్కారం, సన్మానం అందుకున్నారు. కార్యక్రమంలో గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ పాల్గొన్నారు.


