ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన బాణాపురం కీర్తి (20) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని కరికూటిపల్లికి చెందిన అమ్రేష్, శాంతమ్మ దంపతుల కుమార్తె కీర్తికి ఆమిద్యాల గ్రామానికి చెందిన అనిల్తో 8 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల గర్భం దాల్చిన కీర్తికి పిండాభివృద్ధి సరిగా జరగకపోవడంతో అబార్షన్ అయింది. అప్పటి నుంచి కడుపు నొప్పితో కీర్తి బాధపడుతుండేది. గురువారం రాత్రి నొప్పి తీవ్రం కావడంతో ఉరి వేసుకుంది. పొలం నుంచి వచ్చిన భర్త అనిల్ బంధువుల సాయంతో కీర్తిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


