ఉరవకొండ: లారీ దగ్ధమై అందులోని డ్రైవర్ సజీవ దహనమైన ఘటన అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారి కొట్టాలపల్లి వద్ద జరిగింది. బళ్లారి నుంచి అనంతపురం మీదుగా నెల్లూరుకు గ్రానెట్ లోడుతో శుక్రవారం తెల్లవారుజామున లారీ బయలుదేరింది. కొట్టాలపల్లి సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం కనుమపల్లికు చెందిన డ్రైవర్ ఓబుల్రెడ్డి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. క్లీనర్ పుల్లయ్య లారీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ను కాపాడేందుకు క్లీనర్ రోడ్డుపై కేకలు వేస్తూ ఆ మార్గంలో వెళుతున్న వాహనదారుల సాయం కోసం ప్రయత్నించినా ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.


