
ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా పోరాడతాం
● అడ్డంకులు సృష్టించినా..
రంగయ్య పాదయాత్ర పూర్తి చేశారు●
● కూటమి నేతలు వెంటనే ప్రధాని మోదీని కలవాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
కళ్యాణదుర్గం: కులమత భేదాలు చూపకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని వర్గాలనూ ఆదుకున్న ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకైనా పోరాడతామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డీటీకి నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర 16 రోజులు కొనసాగి గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం బళ్లారి మిట్టపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘అనంత’ మాట్లాడారు. ఆర్డీటీని కాపాడుకునేందుకు దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని, అందులో భాగమే రంగయ్య పాదయాత్ర అన్నారు. రంగయ్య పాదయాత్ర చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో పాదయత్రను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. పాదయాత్ర చేస్తే కాళ్లకు నొప్పులు...బొబ్బలు వస్తాయని టీడీపీ నేతలు వ్యంగంగా మాట్లాడారని దుయ్యబట్టారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇప్పటికే బైకు ర్యాలీ చేశామన్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలే వైఎస్సార్సీపీకి వెన్నెముక అన్నారు. ఆర్డీటీకి నష్టం కలిగించేందుకు బీజేపీ, కూటమి ప్రభుత్వం మతం రంగు పూసిందని మండి పడ్డారు. ఆర్డీటీపై ప్రజల అభిప్రాయాలను కేంద్రానికి పంపాలని సూచించారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కోసం జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు మంత్రులు వెంటనే పీఎం మోదీ, కేంద్రం హోం మంత్రిని కలవాలన్నారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంత పురం జిల్లాను అభివృద్ధి చేసేందుకు 55 ఏళ్ల నుంచి ఆర్డీటీ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఆర్డీటీ మనుగడకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రాంత ప్రజల కోసమే..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీ కోసం రెండోసారి పోరాటం చేపట్టామన్నారు. ఈ ప్రాంత ప్రజల బాగు కోసం రంగయ్య పాదయాత్ర చేసినట్లు తెలిపారు. పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, వారు తుపాకులతో అడ్డుకున్నా రంగయ్య జంకలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం నగరపాలక డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా తదితరులు పాల్గొన్నారు.
ఇది ప్రజా ఉద్యమం..
పార్టీ ఆశీస్సులు, ప్రజా మద్దతుతో విజయ వంతంగా పాదయాత్ర పూర్తి చేశా. నాది రాజకీయ ఉద్యమం కాదు.. గొప్ప ప్రజా ఉద్యమం. ఆర్డీటీ ఆసుపత్రులు మూతపడితే పేద ప్రజలకు జరిగే నష్టాన్ని గుర్తెరిగి మంచి కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. – తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు

ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా పోరాడతాం