గార్లదిన్నె: మండలంలోని కల్లూరులో బుడగజంగాల కాలనీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఈ నెల 11న కల్లూరు ఊరి దేవర నిర్వహించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త విభూది జమ్మన్న ఇంటికి టీడీపీ నాయకులు ఫ్లెక్సీ కట్టారు. ఆ సమయంలో పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఊరి దేవర కార్యక్రమం కావడంతో తన ఇంటికి కట్టిన ప్లెక్సీ తొలగించాలని సూచించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. కులపెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పాడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. ఈ అంశంపై ప్రతిష్టకు పోయిన టీడీపీ నేతలు రెండు రోజులు తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వైఎస్సార్సీపీకి చెందిన ఆంజనేయులు, రామాంజనేయులు, చిన్నకుళ్లాయప్ప, జమ్మన్న, రాజుపై అక్రమంగా కేసు బనాయించారు. దీంతో గురువారం జిల్లా కోర్టులో వాయిదా చూసుకుని గార్లదిన్నె పీఎస్కు చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషాను కలసి మాట్లాడారు. అనంతరం ఇంటికి వెళుతుండగా కల్లూరు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. అనంతరం కాలనీకి చేరుకుని ఇంటి వద్ద ఉన్న రామాంజనేయులు, వెంకటలక్ష్మి, శిరీషపై దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గార్లదిన్నె పోలీసులు సర్వజనాస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.