అనకాపల్లి టౌన్: పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో వీచిన ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా హోర్డింగ్, కటౌట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గవరపాలెం పార్స్ సెంటర్, విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జి, శారదానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వర్షం బీభత్సంతో నాలుగురోడ్ల జంక్షన్లో బస్టాప్ ముందర ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్, జీవీఎంసీ కార్యాలయం మేడపైన ఉన్న కటౌట్లు నేలకొరిగాయి.
దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రదేశంలో నిత్యం బస్లు, ఆటోల కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. వర్షం వల్ల జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక వర్షం కారణంతో రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.


