సాక్షి, అనకాపల్లి :
ఎండాకాలంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఈ ఏడాది మార్చి నెల ప్రారంభం నుంచే అధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగానే ఉష్టోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. అగ్గిలా మండే ఎండలకు తోడు అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల వరకూ ప్రజలతో పాటు అగ్ని మాపక సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను ఆప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 8 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయే అవకాశం ఉంటుంది.
పారిశ్రామిక ప్రాంతం..ప్రమాదాల నిలయం
జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, కశింకోట మండల పరిధిలో ఒక వైపు పరిశ్రమలు, మరో వైపు ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 560 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిలో రూ.10 లక్షలకు పైగా నష్టం సంభవించిన ప్రమాదాలు 2 అత్యంత ప్రమాదకరమైనవి కాగా..40 మీడియం ఫైర్ కాల్స్ (రూ.2 లక్షల నుంచి రూ.10ల క్షల లోపు ), 489 చిన్నపాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన 610 అగ్ని ప్రమాదాల్లో రూ.232 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవిం చగా, రూ.289 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఈ ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడగలిగారు. అలాగే ఈ ప్రమాదాల్లో 20 పశువులు చనిపోగా, ఒక దాన్ని సిబ్బంది కాపాడారు. రెస్క్యూ చేస్తుండగా 18 మంది చనిపోగా..ముగ్గురిని కాపాడగలిగారు.
అవగాహన కోసమే వారోత్సవాలు
అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహి స్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా, విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించడం, బస్టాండ్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్ని మాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన, ఎల్పీజీ స్టోరేజీ, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రిల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా తమని తాము కాపాడుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు.
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న దృశ్యం(ఫైల్)
విస్తృతంగా అవగాహన..
జిల్లాలో సెజ్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో..సేప్టీ ఆడిట్లో భాగంగా ప్రతీ నెలా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. మీ ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగిన తక్షణమే ఆయా పరిధిలో ఉన్న ఫైర్స్టేషన్లకు సమచారం ఇవ్వాలని కోరారు. వేసవిలో ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.
– వెంకట రమణ, జిల్లా అగ్నిమాపక అధికారి
● గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచి వాడాలి.
● అదనపు సిలిండర్ను వాడుతున్న సిలిండర్కు దూరంగా ఉంచాలి.
● మండే వస్తువులు గ్యాస్ సిలిండర్కు దూరంగా ఉంచాలి.
● చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు.
● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలి.
● ఐఎస్ఐ మార్కు ఉన్న ఎల్పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి.
● గ్యాస్ లీక్ అవుతున్న అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి.
● ఆ సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయకూడదు.
● ఒక ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఎక్కువ ప్లగ్లు పెట్టరాదు.
● ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి.
● విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ను నిప్పు మీద చల్లాలి.
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పి పారేయాలి.
● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తరాదు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి.
● కాలిన శరీర భాగాల మీద చల్లని నీరు పోయాలి.
● గడ్డివాములను నివాస గృహాలకు దూరంగా వేసుకోవాలి.
● కార్మికులు పనిచేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలి.
జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు దూరం...


