నాతవరం : ఉపాధి హామీ పథకంలో ముఖఅధారిత హాజరు రాష్ట్రంలోనే మనం మొదట స్థానంలో ఉన్నామని ఉమ్మడి జిల్లా డ్వామా ప్రాజెక్టు అధికారి సిహెచ్.నిర్మలాదేవి అన్నారు. మండలంలో బుధవారం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను తనిఖీలు చేశారు. పనిచేసే మస్తరు హాజరు పట్టికను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందుల గురించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామపెద్దలతో సమావేశమై ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి పలు విషయాలను డ్వామా ప్రాజెక్టు అధికారి దృష్టికి మాజీ సర్పంచ్ బాబులునాయుడు తీసుకెళ్లారు. ఈ పథకంలో పనిచేసిన కూలీ డబ్బులు సకాలంలో రావడం లేదని కొందరు ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహత్మాగాంధీ ఉపాధి పథకం పేరు ఈనెల వరకు మాత్రమే ఉంటుందన్నారు. వచ్చే నేల మే నుంచి కేంద్ర ప్రభుత్వం ఈపథకం పేరు మార్పు చేస్తుందన్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు హాజరు ముఖ ఆధారితలో రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా మొదట స్థానంలో, అనకాపల్లి జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ముఖ అధారిత హాజరు కారణంగా ఉపాఽధి హామీ పఽథకంలో ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆవకాశం లేదన్నారు. వచ్చే నెల నుంచి ఆ పథకంలో అనేక మార్పులు వస్తాయని వాటిపై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జల ధార జలహారతి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి లోవరాజు, ఉపాధి హామీ పథకం ఏపీడీ చిన్నారావు, ఏపీవో దాసరి కొండాజీ పాల్గొన్నారు.


