
అస్తవ్యస్తంగా పోలవరం కాలువ పనులు ఇష్టానుసారంగా వ్యవహరిస
కాలువ తవ్వకాలతో బురదమయంగా తయారైన వల్లకొత్తూరు వెళ్లే రోడ్డు
నక్కపల్లి: మండలంలో పోలవరం కాలువ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టరు రోడ్లను ఇష్టానుసారం తవ్వేసి, అసంపూర్తిగా వదిలేయడంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడుతున్నారు. వర్షాలు పడితే ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పోలవరం ఎడమప్రధాన కాలువ 6,7,8 ప్యాకేజీల కింద పనులు పునఃప్రారంభమయ్యాయి.కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. జగన్నాథపురం నుంచి దోసలపాడు, చీడిక మీదుగా కొత్తూరు వెళ్లేమార్గంలో పోలవరం కాలువ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రోడ్డును అడ్డంగా తవ్వేశారు. పక్కనుంచి అప్రోచ్ రోడ్డు లేదా రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చీడిక, కొత్తూరు, సీతానగరం తదితర గ్రామాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాల వారు ఏ అత్యవసరమైనా తుని,పాయయరావుపేట పట్టణాలకు రావాల్సి ఉంటుంది. ద్విచక్రవాహనాలు, ఆటోల్లోనే రాకపోకలు సాగించాలి. పాఠశాలు, కాలేజీలకు విద్యార్థులు కూడా మోటారు సైకిళ్లు, స్కూలు బస్సులు, ఆటోల్లోనే రావాలి. కొద్దిరోజుల కిత్రం కాంట్రాక్టర్ కాలువ నిర్మాణం కోసం ఈ గ్రామాలకు వెళ్లే రోడ్డును మధ్యలో తవ్వేయడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రాంతాలనుంచి విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చే బస్సులు కాలువ తవ్వేసిన ప్రాంతం వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అవతల గ్రామాలకు రావడానికి బస్సు డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. వర్షాలు పడడంతో తవ్విన ప్రాంతమంతా బురదమయంగా మారిందని బస్సులు కూరుకుపోతాయన్న బెంగతో రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ తవ్విన ప్రాంతం వరకు పిల్లలను తీసుకురావాలంటే సుమారు కిలోమీటరు పైనే నడిచి రావాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. చీడిక గ్రామస్తులయితే రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కాలువ వద్ద ఆటోలు కూరుకుపోతున్నాయని, రాత్రిపూట రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లే మార్గంలో కాంట్రాక్టరు రోడ్డును ఇష్టానుసారం తవ్వేయడమే కాకుండా వెంటనే నిర్మించడం లేదా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపరిస్థితి ఇలా ఉండటం వల్ల ఆటో డ్రైవర్లు కూడా గ్రామాల్లోకి రావడానికి భయపడుతున్నారని చెప్పారు. అత్యవసర వైద్య సహాయం కోసం ఆస్పత్రికి ఆటోల్లోనే రావాల్సి ఉంటుందని, రోడ్డుపరిస్థితి ఇలా ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు పడటం వల్ల రోడ్డు అంతా బురదగా మారిందని, కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితి ఉండటం లేదన్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పునఃనిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోదిగల్లంనుంచి పెదదొడ్డిగల్లు, వెదుళ్లపాలెంనుంచి సీతం పాలెం వెళ్లే మార్గాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటూ ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. రోడ్లను ఇష్టానుసారం తవ్వేసి, వెంటనే పూడ్చడం లేదని, రోజుల తరబడి వదిలేయడం వల్ల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామంటూ ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేవారు చెబుతున్నారు. కల్వర్టులు నిర్మించి రోడ్లను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్లు తవ్వేసి..
కష్టాలకు వదిలేసి

అస్తవ్యస్తంగా పోలవరం కాలువ పనులు ఇష్టానుసారంగా వ్యవహరిస