
ఎస్బీలో వారిదేహవా!
● చక్రం తిప్పుతున్న ఇద్దరు రైటర్లు ● దీర్ఘకాలంగా ఉన్న ఫీల్డ్ అధికారిదే పెత్తనం ● కొత్తగా వచ్చిన వారిని బదిలీ చేయించేందుకు చాడీలు ● అనుకూలమైన వారికి చోటు కల్పించేందుకు యత్నం
ఇటీవల స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కొంత మేర బదిలీలు జరిగాయి. బదిలీల్లో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేసిన ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చారు. విధుల్లో చేరి నెలన్నర పూర్తయినా వారికి పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ విభాగంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి పదోన్నతి వచ్చే అవకాశం ఉండడంతో... విభాగంలో జరుగుతున్న విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా అక్కడ రైటర్లుగా పనిచేస్తున్న వారే చక్రం తిప్పుతున్నారు. దీంతో బదిలీ అయి వేరే విభాగానికి వెళ్లిన వారే ఇంకా ఫీల్డ్ అధికారులుగా పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారిని పూర్తిగా పక్కన పెట్టారు. వారికి ఎలాంటి అధికారాలు అప్పగించలేదు. వీరిపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పి ఇక్కడి నుంచి పంపే ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసింది. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఈ విభాగానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని సమాచారం. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిన కొందరు ఎలాగైనా మళ్లీ అనకాపల్లి రావాలని యత్నిస్తున్నారు.
ప్రక్షాళనపై సాక్షాత్తూ డీఐజీ దృష్టి సారించినా ఫలితం శూన్యం
సాక్షి, అనకాపల్లి: జిల్లా స్పెషల్ బ్రాంచి విభాగం ప్రక్షాళనపై సాక్షాత్తూ డీఐజీ దృష్టి సారించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇంకా పాతవారి హవా కొనసాగుతోంది. రెండు నెలల కిందట ఈ విభాగం నుంచి కొంత మందిని బదిలీ చేసినా.. వారు ఇంకా విధుల నుంచి తప్పుకోవడం లేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన వారిని ఇక్కడ నుంచి ఎలాగైనా తిరిగి పంపించేయాలని పన్నాగాలు పన్నుతున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు రైటర్లు, ఒక ఫీల్డ్ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు భోగట్టా పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచి విభాగం అతిముఖ్యమైనది. జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతోంది?, పోలీసుల పనితీరు ఎలా ఉంది?, ప్రజలు ఏమనుకుంటున్నారు?, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతర సంఘాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి...తదితర వివరాలను స్పెషల్బ్రాంచి ఎప్పటికప్పుడు సేకరించి ఎస్పీకి నివేదిక అందజేస్తుంది. ఇందుకోసం సీఐతో హెడ్కానిస్టేబుల్/కానిస్టేబుళ్లు ఉంటారు. అయితే స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్న సిబ్బంది చాలా ఏళ్లుగా అక్కడే ఉండిపోవడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు, కీలకమైన సమాచారాన్ని ఎస్పీకి కంటే ముందుగా ప్రజాప్రతినిధులకు చేరవేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకత పూర్తిగాలోపించింది. ఈ విభాగంలో పేరుకే అధికారులున్నారు తప్ప.. నిర్వహణ, కార్యకలాపాలు ఇద్దరు రైటర్ల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఈ విషయా లన్నీ డీఐజీ దృష్టికి వెళ్లడంతో ప్రక్షాళన చేయాలని ప్రత్యేకంగా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల బదిలీలు జరిపారు.
బదిలీల ప్రక్రియ అపహాస్యం..
డీఐజీ ఆదేశాలు బేఖాతరు..
ఎస్బీలో సిబ్బందిని పూర్తిగా మార్చాలని డీఐజీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కాలేదు. కొద్దిపాటి మార్పులు చేసి, ఉన్నతాధికారులకు అసలైన పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు బదిలీపై వచ్చిన అధికారులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైటర్ల హవా తగ్గించడంతో పాటు దీర్ఘకాలంగా ఈ విభాగంలో తిష్ట వేసి వ్యవస్థను మేనేజ్ చేస్తున్న వారికి చెక్ పెట్టాలని సిబ్బంది కోరుతున్నారు.