
నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన
కశింకోట: నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన, పాఠశాలల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఆదేశించారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దీనిలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణ, బోధన, మూల్యాంకనం, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తదితర కార్యక్రమాల్లో మార్పులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. అకడమిక్ క్యాలెండర్, టీచర్ హ్యాండ్ బుక్ల నిర్వహణ అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా శత శాతం అమలు చేయాల్సిందేనన్నారు.
యోగాంధ్ర విజయవంతం చేయాలి
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో శత శాతం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో అన్నారు. జిల్లాలో అర్హులందరికీ ఇప్పటికే తల్లికి వందనం నగదు జమ అయినట్టు తెలిపారు. పథకం వర్తించని అర్హులు సంబంధిత సచివాలయాల్లో సంప్రదించి వారి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరగడానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అవసరం ఉన్న మేరకు పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగాను, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా స్థాయిని పెంచినట్టు చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎదురైతే సర్దుబాటు చేస్తామని తెలిపారు. మారిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సూచించారు. జిల్లా ఉప విద్యా శాఖ అధికారి పొన్నాడ అప్పారావు, ఏసీ శ్రీధర్రెడ్డి,డీసీసీబీ కార్యదర్శి సత్యనారాయణ, సీసీ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
డీఈవో అప్పారావు నాయుడు